Haryana : రైతులపైకి దూసుకెళ్లిన బీజేపీ ఎంపీ కారు..ఒకరికి గాయాలు
హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపై బీజేపీ ఎంపీ కారు దూసుకెళ్లింది.

Haryana
Ambala హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపై బీజేపీ ఎంపీ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ రైతు గాయపడ్డాడు. హర్యానాలోని అంబాలా సిటీకి సమీపంలోని నారైంగర్లో గురువారం(అక్టోబర్-7,2021)ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, దేశవ్యాప్తంగా కలకలం రేసిన లఖింపూర్ ఘటన జరిగిన నాలగు రోజుల్లోనే ఇప్పుడు హర్యానాలో రైతులపై బీజేపీ ఎంపీ కారు దూసుకెళ్లడం గమనార్హం.
అసలేం జరిగింది
కురుక్షేత్ర ఎంపీ నయాబ్ సైనీ, రాష్ట్ర గనుల శాఖ మంత్రి మూల్ చంద్ శర్మతో సహా ఇతర బీజేపీ పార్టీ నాయకులు నారైంగర్లోని సైని భవన్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే బీజేపీ నాయకుల పర్యటనకు నిరసనగా సైని భవన్ బయట పెద్ద సమూహం గుమిగూడింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ రైతులు సైని భవన్ బయట నిరసన చేపట్టారు. కాగా, సైని భవన్ లో కార్యక్రమం ముగిసిన తర్వాత బీజేపీ నేతల కార్ల కాన్వాయ్ ఆ ప్రాంతం నుండి నిష్క్రమించినప్పుడు.. ఒక వాహనం రైతును ఢీకొట్టింది. రైతుని ఢీకొట్టిన కారు బీజేపీ ఎంపీ నయాబ్ సైనీదేనని రైతులు ఆరోపించారు. ఇక,గాయపడిన రైతుని నారైంగర్ హాస్పిటల్ కు తరలించారు.
కాగా, ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఆదివారం యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్ ఖేరీ జిల్లాలోని టికునియా-బన్బీర్పుర్ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో మంత్రుల కాన్వాయ్ లోని రెండు కార్లు రైతులపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా..ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. అయితే రైతులపైకి దూసుకెళ్లిన ఓ కారులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తుండగా..అసలు ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆశిష్ మిశ్రా చెబుతున్నారు. ఎలాంటి దర్యాప్తుకైనా సిద్దమేనని ఆశిష్ మిశ్రా తెలిపారు.
ALSO READ ఐఐఎఫ్ఎల్ రిచ్ లిస్ట్ – తెలుగు రాష్ట్రాల్లో రూ.1000 కోట్లపైగా సంపద ఉన్న కుబేరులు వీరే