Maoists Encounter : నెల రోజుల్లో 79మంది మావోయిస్టులు మృతి.. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి

మావోయిస్టులకు శత్రుదుర్భేగ్యంగా ఉన్న చోట్లకు కూడా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి.

Maoists Encounter : నెల రోజుల్లో 79మంది మావోయిస్టులు మృతి.. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి

Operation Bastar

Maoists Encounter : కాకులు దూరని కారడివి. చీమలు దూరని చిట్టడివి. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న బస్తర్ లో వరుస ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే వేర్వేరు ఎన్ కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి చెందిన 79మంది మరణించారు. వరుస ఎదురు దెబ్బలతో కేంద్ర మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

వరుస ఎన్ కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరి..
వరుస ఎన్‌కౌంటర్లతో ఛత్తీస్‌గడ్ అడవుల్లో అలజడి కొనసాగుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఐదారు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో 79మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2019 నుంచి వరుస ఎన్‌కౌంటర్లతో బలం కోల్పోతుంది మావోయిస్టు పార్టీ. ప్రతీ ఎన్‌కౌంటర్‌లో పదుల సంఖ్యలో మావోలు హతమవుతుండటంతో.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎన్‌కౌంటర్లలో మావోయిస్ట్ అగ్రనేతలు ప్రాణాలు కోల్పోతుండటం వారికి మరింత ఆందోళన కలిగిస్తుంది.

మావోయిస్టులకు శత్రుదుర్భేగ్యంగా ఉన్న చోట్లకు కూడా భద్రతా బలగాలు..
నారాయణపూర్‌, బీజాపూర్, దంతేవాడ, బస్తర్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నచోట కొన్నాళ్లుగా ఆపరేషన్‌ కొనసాగుతోంది. నెలల తరబడి భద్రతా బలగాల కూంబింగ్‌ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులకు శత్రుదుర్భేగ్యంగా ఉన్న చోట్లకు కూడా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి.

ఇదే అతిపెద్ద ఎన్ కౌంటర్..
2019లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 65మంది మావోయిస్టులు చనిపోయారు. 2020లో 36మంది, 2021లో 47మంది, 2022లో 30మంది , 2023లో 24మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఏప్రిల్‌ వరకే 79మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో హతం అయ్యారు. ఇప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌ చాలా పెద్దదిగా చెబుతున్నాయి భద్రతా బలగాలు. బస్తర్‌ జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 12మంది మహిళా మావోయిస్టులు, 15మంది పురుషులు మొత్తం 29మంది చనిపోయారు.

బస్తర్ అడవుల్లో టెన్షన్.. టెన్షన్..
భారీ ఎన్‌కౌంటర్ తర్వాత ఛత్తీస్‌గడ్ బస్తర్‌ అడవుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టెన్షన్ సిచ్యువేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. టెన్షన్..టెన్షన్..ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌ తర్వాత కూడా భద్రతాబలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది. బస్తర్ అడవులను జల్లడ పడుతున్నాయి భద్రతాబలగాలు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 29మంది నక్సలైట్ల డెడ్‌బాడీలకు కాంకేర్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఎన్‌కౌంటర్ సమయంలో 60మందికిపైగా నక్సల్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

4 గంటలు హోరాహోరీగా కాల్పులు..
డీఆర్జీ, బీఎస్‌ఎఫ్ జవాన్లు కలసి ఈ ఆపరేషన్ చేసినట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. భద్రతాబలగాలు నక్సల్స్‌ను చుట్టుముట్టగానే ఎదురుకాల్పులు జరిగాయని.. నాలుగు గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో ఏడు ఏకే 47లు, మూడు LMGలు, మూడు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, రెండు పిస్టల్స్, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు 303 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్‌కౌంటర్‌ సమయలో ఘటనాస్థలంలో పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్ట్ నార్త్ బస్తర్ డివిజన్‌కు చెందిన డివిజనల్ కమిటీ సభ్యులు శంకర్, లలిత ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆయన తలపై 25లక్షల రివార్డ్..
ఎన్‌కౌంటర్‌లో ఏపీకి చెందిన అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్‌ శంకర్‌రావు ఉన్నారు. ఆయనపై 25 లక్షల రివార్డు ఉంది. ఇద్దరు తెలంగాణ వాసులను కూడా గుర్తించారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌రావుతో పాటు ఆయన భార్య, ఆదిలాబాద్‌ జిల్లా హత్నూర్‌కు చెందిన దాసర్వర్‌ సుమన అలియాస్‌ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.

సమాచారం ఇస్తే 5లక్షల నగదు, ఉద్యోగం..
లోక్‌సభ ఎన్నికల వేళ జరిగిన బస్తర్‌ ఎన్‌కౌంటర్ సంచలనం సృష్టిస్తోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతాబలగాలు ఆపరేషన్ బస్తర్‌ను కంటిన్యూ చేస్తున్నాయి. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టుల సమాచారం అందించినవారికి 5లక్షల నగదు, ఉద్యోగం ఇస్తామంటూ ప్రకటించారు ఛత్తీస్‌గడ్ పోలీసులు.

ఉజ్వల భవిష్యత్తుకు నక్సలిజం అతిపెద్ద శత్రువు..
బస్తర్ నకల్స్‌ ఆపరేషన్‌పై భద్రతాబలగాలను ప్రశంసించారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా. భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలను చూపించి.. ఆపరేషన్ విజయవంతం చేశారన్నారు. దేశాభివృద్ధి, శాంతి భద్రతలు, యువత ఉజ్వల భవిష్యత్తుకు నక్సలిజం అతిపెద్ద శత్రువుగా మారిందన్నారు షా. త్వరలో ఛత్తీస్‌గఢ్‌తోపాటు దేశం మొత్తం నక్సల్స్ రహితంగా మారుతుందన్నారు. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Also Read : ప్రముఖ సినీ నటుడి కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి