Uttar Pradesh: రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన మొసలి.. తెల్లారేదాకా ఇంట్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన కుటుంబం
రాత్రిపూట ఇంట్లో నిద్రిస్తుండగా లోపలికి ప్రవేశించిందో మొసలి. వెంటనే లేచి చూసిన ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఉలిక్కి పడ్డారు. తెల్లారి అధికారులు వచ్చి సహాయక చర్యలు చేపట్టేవరకు ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు.

Uttar Pradesh: ఉన్నట్లుండి ఇంట్లోకి మొసలి ప్రవేశించడంతో ఒక కుటుంబం ఉలిక్కిపడింది. రాత్రి పూట వచ్చిన మొసలి భయంతో ఆ కుటుంబం తెల్లార్లూ మేల్కొనే ఉంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, ఎతావా పరిధిలోని జైతియా అనే గ్రామంలో గత శనివారం రాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైతియా గ్రామంలోని హర్నామ్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లోకి రాత్రి ఒక మొసలి ప్రవేశించింది. ఇంట్లోని వారంతా నిద్రించి ఉండగా, పదిన్నర గంటల సమయంలో ఏదో శబ్దం వినిపించింది. దీంతో మేల్కొని చూసే సరికి ఇంట్లో ఎనిమిది అడుగుల మొసలి కనిపించింది. వెంటనే భయాందోళనకు గురైన ఆ కుటుంబం పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు అటవీశాఖ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. వారి సలహా మేరకు ఆ కుటుంబం ఇంట్లోనే లాక్ చేసుకుని ఉండిపోయింది. తెల్లారేవరకు ఎవరూ బయటకు రాలేని పరిస్థితి. ఈ విషయం బయటకు తెలియడంతో చుట్టుపక్కల జనం అంతా హర్నామ్ సింగ్ ఇంటి దగ్గరకు చేరిపోయారు.
PM Modi: గుజరాత్ ప్రమాద స్థలానికి మోదీ.. మంగళవారం పర్యటించనున్న ప్రధాని
తర్వాత ఉదయం ఆరు గంటలకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఆ ఇంటికి చేరుకుని మొసలిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు గంటసేపు శ్రమించి, మొసలిని సురక్షితంగా బంధించారు. తర్వాత మొసలిని అటవీశాఖ సిబ్బంది రక్షణ ప్రదేశానికి తీసుకెళ్లారు. దీంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ, ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపిన ఇంట్లోని వాళ్లు సురక్షితంగా బయటపడ్డారు. కాగా, మొసలి వయసు చాలా తక్కువని, ఇంకా పూర్తిగా ఎదగలేదని, ఆహారాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ మొసలిని సురక్షితమైన నీటి ప్రదేశంలో వదిలిపెడతామని అధికారులు చెప్పారు.