కరోనా టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డు

India holds world record for corona vaccine distribution : కరోనా టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డు సాధించింది. తొలిరోజు అత్యధిక సంఖ్యలో టీకాను పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. కరోనా వ్యాక్సినేషన్లో ఫ్రాన్స్, యూకే, అమెరికాను భారత్ అధిగమించిందన్న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న దేశవ్యాప్తంగా 2 లక్షల 7వేల 229 మందికి టీకాలు వేశామని కేంద్రం ప్రకటించింది. రెండో రోజూ కూడా ఆరు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగిందని.. నేడు 17 వేల 72 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. రెండు రోజుల్లో మొత్తం 2 లక్షల 24 వేల301 మందికి వ్యాక్సినేషన్ వేసినట్టు కేంద్రం తెలిపింది.
మరోవైపు రెండో రోజైన ఆదివారం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే టీకా కార్యక్రమం కొనసాగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ తెలిపారు. రెండో రోజున దేశవ్యాప్తంగా 553 కేంద్రాల్లో 17,072 మందికి టీకాలు వేసినట్లు చెప్పారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,24,301 మంది కరోనా టీకా వేయించుకున్నారని వెల్లడించారు.
మరోవైపు శని, ఆదివారాల్లో టీకా వేయించుకున్న 447మందిలో స్వల్ప ప్రతికూలతలు కనపించాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో చాలా వరకు జ్వరం, తలనొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపించాయని పేర్కొంది. ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, చికిత్స అనంతరం ఢిల్లీలో ఇద్దరు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ఎయిమ్స్ రిషికేశ్లో ఒకరు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించింది.