Akhilesh Yadav: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపై అఖిలేశ్ వింత వ్యాఖ్యలు
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా పరాజయం పాలవడంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వెరైటీగా స్పందించారు.

India Would Have Won World Cup If match had happened in Lucknow: Akhilesh Yadav
Akhilesh Yadav on Team India : వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో బాధ పడ్డారు. భారత జట్టు ఓటమిపై ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం కారణమని కొందరంటే.. బౌలర్లు విఫలమయ్యారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా కాదు ఆస్ట్రేలియా మనకంటే బాగా ఆడినందువల్లే గెలిచిందని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాత్రం వెరైటీగా స్పందించారు.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్ లో నిర్వహించడం వల్లే టీమిండియా ఓడిపోయిందని, లక్నోలో నిర్వహించివుంటే మన టీమ్ గెలిచేదని వ్యాఖ్యానించారు. “గుజరాత్లో జరిగిన మ్యాచ్ (వరల్డ్ కప్ 2023 ఫైనల్) లక్నోలో జరిగి ఉంటే, వారికి (టీమ్ ఇండియా) చాలా మంది ఆశీర్వాదం లభించేది. ఫైనల్ మ్యాచ్ లక్నోలో జరిగి ఉంటే మహావిష్ణువు, అటల్ బిహారీ వాజ్పేయి ఆశీస్సులతో టీమిండియా కచ్చితంగా గెలిచి ఉండేది. పిచ్ విషయంలో కొంత సమస్య ఉందన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంద’’ని అఖిలేశ్ యాదవ్ విలేకరులతో అన్నారు.
కాగా, టాస్ ఓడిపోవడం వల్లే టీమిండియా పరాజయం పాలైందన్న వాదన కూడా ఉంది. ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ మైదానంలో ఫస్ట్ బ్యాటింగ్ కు పిచ్ సహకరించలేదని విశ్లేషకులు అంటున్నారు. పిచ్ బౌలింగ్ కు అనుకూలించడంతో టిమిండియా భారీ స్కోరు చేయలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. వరుసగా 10 మ్యాచ్లు గెలిచిన రోహిత్ సేన ఫైనల్లో ఓడిపోవడంతో ఆస్ట్రేలియా ప్రపంచకప్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఓటమి భారంతో ఉన్న టీమిండియా ఆటగాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓదార్చారు. ప్రపంచకప్ టైటిల్ గెలవకపోయినా తమ హృదయాలు గెలిచారంటూ టీమిండియా ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు.
Also Read: 107 బంతుల్లో 66 పరుగులా.. ఏంటి రాహుల్ ఇది?- పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యలు