బిహార్‌లో ఎన్డీఏ విజయ దుందుభి.. రాకెట్‌లా దూసుకుపోవడానికి కారణాలు ఇవే.. కొత్త ట్రెండు సృష్టించిందిగా.. ఇకపై..

జేడీయూ, బీజేపీకి సమగ్ర బూత్‌ కమిటీలు ఉన్నాయి. డిజిటల్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు బాగా ఉండడంతో తమవైపు మొగ్గుచూపే ఓటర్లను పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు రాబట్టాయి. దీనివల్ల సాధారణంగా ఎన్డీఏకి 3-5 శాతం అదనంగా ఓట్ల లాభం వస్తుంది.

బిహార్‌లో ఎన్డీఏ విజయ దుందుభి.. రాకెట్‌లా దూసుకుపోవడానికి కారణాలు ఇవే.. కొత్త ట్రెండు సృష్టించిందిగా.. ఇకపై..

Updated On : November 14, 2025 / 12:30 PM IST

NDA Win: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అంచనాలకు మించి సీట్లు రాబట్టింది. ఎప్పటిలాగే బిహార్‌లో కీలకమైన పలు అంశాలు ఎన్డీఏ విజయానికి బలమైన కారణాలుగా నిలిచాయి. అంచనాలకు మించి రాణించడానికి మాత్రం ఎన్డీఏ అమలు చేసిన మరికొన్ని ట్రెండ్‌ సెట్టింగ్‌ వ్యూహాలే కారణం.

కుల సమీకరణాలే గెలుపు పాచికలు
బిహార్‌లో ఎన్నో దశాబ్దాలుగా కుల సమీకరణాలే గెలుపు పాచికలుగా ఉంటున్నాయి. ఎన్డీఏ గెలుపునకు పైకులాలు, ఈబీసీలు, కొన్ని ప్రాంతాల్లోని ఓబీసీ ఓటర్లే ప్రధాన కారణం. వెనుకబడిన వర్గాలే లక్ష్యంగా ఎన్డీఏ అమలు చేస్తున్న పథకాలు, అనేక ప్రాంతాల్లో ప్రాతినిధిత్వం వల్ల ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ కూటమి పట్ల ఆకర్షితులవుతున్నారు.

నితీశ్‌ కుమార్‌ పరిపాలన
పల్టీ రామ్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ సీఎం నితీశ్‌ కుమార్‌కు పలు విషయాల్లో మంచి పేరు ఉంది. రహదారుల అభివృద్ధి, చట్ట వ్యవస్థను మెరురుపర్చడం, గ్రామాల విద్యుద్దీకరణ, అమ్మాయిల చదువుకు ప్రోత్సాహం, గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసిన పథకాలు నితీశ్‌ కుమార్‌ వైపునకు ఓటర్లను మర్లేలా చేశాయి. మహిళలు, మొదటిసారి ఓట్లు వేస్తున్నవారు నితీశ్‌ కుమార్‌ వైపే మొగ్గుచూపుతారు.

Also Read: బిహార్‌లో ఎన్డీఏ ప్రభంజనం.. అతిపెద్ద పార్టీగా బీజేపీ.. కొత్త సీఎంగా..

మోదీ ప్రభావం, కేంద్ర పథకాలు
ప్రధానమంత్రి మోదీకి వ్యక్తిగతంగా ఉన్న ఆదరణ కూడా బిహార్‌లో ఎన్డీఏ గెలుపునకు బాటలు వేశాయి. పీఎం నివాస పథకం, ఉజ్వల, ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ వంటివి అత్యంత పేద కుటుంబాలకు ఎంతో మేలు చేశాయి.

ద్రవ్యోల్బణం, ఉద్యోగ సంక్షోభ సమయంలో..
ద్రవ్యోల్బణం, ఉద్యోగ సంక్షోభ సమయంలో బిహార్‌లోని డబుల్‌ ఇంజన్‌ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉచిత రేషన్, నగదు బదిలీలు, సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లు, మహిళలు, కూలీలు, వలస కార్మికులకు బాగా ఉపయోగపడ్డాయి.

ప్రతిపక్ష ఓటు చీల్చి..
మహాఘట్‌బంధన్‌లో ఉన్న అంతర్గత విభేదాలు, నాయకత్వ గందరగోళం, సీట్ల సర్దుబాటు వివాదాలు ఉన్నాయి. అలాగే, ముస్లిం-యాదవ, కుర్మీ-కొయరీ ప్రాంతాల్లో ప్రతిపక్ష ఓటు చీలిపోయింది. దీన్ని ఎన్డీఏ లాభంగా మార్చుకుంది.

బలమైన బూత్‌ స్థాయి వ్యవస్థ
జేడీయూ, బీజేపీకి సమగ్ర బూత్‌ కమిటీలు ఉన్నాయి. డిజిటల్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు బాగా ఉండడంతో తమవైపు మొగ్గుచూపే ఓటర్లను పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు రాబట్టాయి. దీనివల్ల సాధారణంగా ఎన్డీఏకి 3-5 శాతం అదనంగా ఓట్ల లాభం వస్తుంది.

అభివృద్ధి, మహిళా ఓటర్ల కీలక పాత్ర
ఎన్నికల్లో ఎన్డీఏ తమ ప్రచారాన్ని అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సంక్షేమంపై కేంద్రీకరించింది. మద్యపాన నిషేధం, పంచాయతీల్లో నితీశ్‌ కుమార్‌ అమలు చేసిన మహిళా రిజర్వేషన్‌, అమ్మాయిలకు సైకిళ్లు వంటివి అన్ని కులాల్లో మహిళా ఓటర్లను ఆకర్షించాయి. బిహార్‌లో మహిళా ఓటర్ల హాజరు ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎన్డీఏకే ప్రయోజనం.

నాయకత్వంపై నమ్మకం
ఉద్యోగాలు, పోటీ పరీక్షల నిర్వహణ తీరుపై యువత అసంతృప్తి ఉన్నా, చాలా మంది ఎన్డీఏ నాయకత్వంపై నమ్మకంతో ఉన్నారు. జాతీయ భద్రత, కేంద్ర నాయకత్వ బలం ప్రభావం యువతపై సానుకూలంగా పడింది.

సమర్థవంతమైన ఎన్నికల వ్యూహం
ఎన్డీఏ ప్రచారంలో భాగంగా భారీ సభలు, కులాలవారీగా చేరికలు, కీలక జిల్లాల్లో మోదీ సభలు, పోలింగ్‌కు చివరి వారాల్లో చాలా వేగంగా ర్యాలీలు ఇవన్నీ ఓటర్లను ఆకర్షించాయి.