జీరో కరోనా జోన్ గా లక్షద్వీప్.. ఎలా సాధ్యమైంది?

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. దేశంలో లక్షల మందిని బాధితులగా చేసింది. ఒక్క లక్షద్వీప్ ఐలాండ్స్ మినహా భారత్ కు చెందిన అన్ని ద్వీపాల్లోనూ కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు లక్షద్వీప్ ఒక్కటే జీరో కరోనా జోన్ గానే ఉంది. అది ఎలా సాధ్యమైంది?
లక్షద్వీప్..10 నివాసయోగ్యమైన ఐలాండ్స్ సహా 36 ఐలాండ్స్ సమూహం. ఇక్కడ దాదాపు 65 వేల మంది నివసిస్తున్నారు. చేపల వేట, వాణిజ్య వ్యాపారాల్లో భాగంగా విదేశాలకు వెళ్లే భారీ ఓడల్లో పనిచేయడమే వీరికి తెలిసింది. ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే కేరళకు రావాల్సి ఉంటుంది. అందుకే నిత్యం లక్షద్వీప్ ప్రజలు కేరళలోని కొచ్చి బేపొర్, ప్రాంతాలకు వస్తూ పోతూ ఉంటారు.
దేశంలోని తొలి కరోనా కేసు నమోదైన రాష్ట్రం కేరళ, ఇతర దేశాలకు రాకపోకలు సాగిస్తున్న ఈ ఐలాండ్స్ కు చెందిన ప్రజల్లో ఒక్కరికి కూడా కరోనా రాకపోవడం నిజంగా అశ్చర్యకరమైన విషయం. అయితే వారి ప్రాంతానికి కరోనా రాకుండా అధికారులు తీసుకున్న చర్యలు, అక్కడి ప్రజల సహకారమే లక్షద్వీప్ ను జీరో కరోనా ప్రాంతంగా నిలిపిందట.
మార్చి 16న ఎప్పటిలాగే కేరళకు వెళ్లిన 3,500 మంది స్థానికులు పలు ఓడల్లో తిరిగి లక్షద్వీప్ కు చేరుకున్నారు. అప్పటికే భారత్ లో వంద కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేరళకు వెళ్లి వచ్చిన వారందరినీ మార్చి 20న క్వారంటైన్ లో ఉండాలని స్థానిక అధికారులు ఆదేశించారు. లాక్ డౌన్ కి ముందే విదేశీ పర్యాటకుల రాకపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షద్వీప్ లోనూ అమలు చేశారు.
ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న ఇక్కడి స్థానిక ప్రజలను కేరళలోని కొచ్చి, మంగళూరులలో కరోనా పరీక్షలు నిర్వహించారు. వారికి కరోనా సోకలేదని నిర్ధారణ అయిన తర్వాతే లక్షద్వీప్ కు తరలించారు. ఆ పరీక్షల్లో లక్షద్వీప్ వాసుల్లో ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదు. మరోవైపు లక్షద్వీప్ లో చిక్కుకున్న ఇతర ప్రాంతాల పర్యాటకులను కొచ్చికి పంపించి అక్కడ 14 రోజులపాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు.
స్థానికులంతా స్వస్థలాలకు పర్యాటకులు కేరళకు వెళ్లాక లక్షద్వీప్ లో అధికారులు ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టారు. ఆశా వర్కర్లు, అంగన్ వాడీల సహకారంతో ఇంటింటికి వెళ్లి కరోనాపై అవగాహన కల్పించారు. జ్వరం, దగ్గులాంటి కరోనా లక్షణాలు ఉన్న వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. లక్షద్వీప్ లో కరోనా పరీక్షలు నిర్వహించే సదుపాయం లేకపోవడంతో కేరళకు పంపించి పరీక్షలు నిర్వహించారు.
లక్షణాలు ఉంటే అధికారులను సంప్రదించడానికి హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా అధికారులకు సహకారం అందించారు. లక్షణాలు కనిపిస్తే స్వయంగా ముందుకొచ్చి పరీక్షలకు శాంపిల్స్ ఇచ్చారు. అయితే అన్నింట్లోనూ కరోనా నెగెటివ్ రావడంతో లక్షద్వీప్ కు కాస్త ఊరట లభించింది.
స్థానికులు కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా అధికారులు అక్కడితో ఆగలేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే లక్షద్వీప్ రాజధాని కవరత్తిలోని ఇందిరా గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కరోనా ప్రత్యేక ఆస్పత్రిగా మార్చారు. భారత ప్రభుత్వ సహకారంతో ఐసోలేషన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లు, ప్రజలు నివసిస్తున్న 10 ఐలాండ్స్ లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అనుమానిత వ్యక్తులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా వారిని, వారి కుటుంబసభ్యులను 14 రోజులపాటు క్వారంటైన్ కేంద్రాల్లోనే ఉంచారు. ఇలా దేశంలో కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలు ప్రారంభించక ముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ముఖ్యంగా పర్యాటకులపై ఆంక్షలు విధించడం, స్థానికుల్లో అనుమానితులకు కరోనా పరీక్షలు చేయించడం, భౌగోళిక స్వరూపం ఇవన్నీ కలిసిరావడంతో లక్షద్వీప్ కరోనాను దరిచేరనీయకుండా అడ్డుకోగలింది.
లాక్ డౌన్ సడలింపుతో స్థానిక ప్రజలు కేరళకు వెళ్లి రావడానికి లక్షద్వీప్ అధికారులు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. కరోనా కాకుండా ఏదైనా అనారోగ్యం వస్తే ఓడల ద్వారా కేరళకు తరలిస్తున్నారు. తీవ్రమైన అనారోగ్యమైతే కేరళ ఆస్పత్రికి తరలించేందుకు చాపర్ సిద్ధం చేశారు. ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్లాలంటే స్థానిక ఈ-పాస్ పోర్టల్ ఈ-జాగ్రత్త నుంచి పాస్ లు పొందాల్సి ఉంటుంది. కేరళలో ఈ-పాస్ పొందిన వారు లక్షద్వీప్ కు రావొచ్చు. అయితే ఎవరు ఎటు వెళ్లి వచ్చినా లక్షద్వీప్ కు వచ్చే ముందు కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో కరోనా నెగెటివ్ అని తేలితేనే ఐలాండ్స్ లోకి అనుమతిస్తున్నారు.