Maharashtra Governor : రంగంలోకి మహారాష్ట్ర గవర్నర్..రెబల్ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం
రెబల్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, ఇళ్లపై దాడులు జరుగుతుండటంతో వారికి భద్రత కల్పించాలని మహారాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ముంబయి సీపీకి కూడా గవర్నర్ లేఖ రాశారు.
Maharashtra Governor : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో రాజ్భవన్ రంగంలోకి దిగింది. కోవిడ్ నుంచి కోలుకుని ఉదయమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గవర్నర్ భగత్సింగ్ కోశ్యారి రాజకీయ సంక్షోభంపై దృష్టిపెట్టారు. రెబల్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, ఇళ్లపై దాడులు జరుగుతుండటంతో వారికి భద్రత కల్పించాలని మహారాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ముంబయి సీపీకి కూడా గవర్నర్ లేఖ రాశారు.
మరోవైపు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో గవర్నర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలున్నాయి. ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం అది చివరి ఆప్షనే కావొచ్చంటున్నారు. రెబల్స్తో కలిపి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గ్యారెంటీ అంటున్నారు.
Maharashtra: 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత
మరోవైపు ఏక్నాథ్ షిండే నేతృత్వంలో కాసేపట్లో రెబల్స్ సమావేశం కాబోతున్నారు. షిండే క్యాంపులో చీలిక వచ్చిందన్న వార్తలతో దీనిపై ఆసక్తి నెలకొంది. చీలిక వర్గాన్ని బీజేపీలో విలీనం చేయడాన్ని కొంతమంది రెబల్స్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది దీనికి అనుకూలంగా ఉంటే మరికొందరు మాత్రం ప్రత్యేక వర్గంగా ఉందామని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమావేశం తర్వాత షిండే తమ వర్గంలో ఎలాంటి చీలక లేదని ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇటు ఆదిత్యఠాక్రేకు బాగా సన్నిహితంగా ఉండే మరో మంత్రి కూడా షిండే క్యాంపులో చేరారన్న ప్రచారమూ సాగుతోంది.