ఘోర ప్రమాదం : ముంబైలో కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి

ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 30మంది గాయపడ్డారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం(మార్చి 14) సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సాయంత్రం వేళ బాగా రద్దీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. CSMT ప్లాట్ఫాం 1కు దారితీసే పాదచారుల వంతెన కుప్పకూలడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.