లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురి మృతి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై డోర్లన్నీ ఇలా..
ప్రస్తుతం సర్వీసులో ఉన్న ట్రైన్ కంపార్ట్మెంట్లను కూడా రీడిజైన్ చేసి..

మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఇవాళ ఉదయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన లోకల్ రైలు నుంచి పలువురు జారిపడ్డారు. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం ముంబ్రా, దివా స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది.
ముంబ్రా స్టేషన్ సమీపంలోకి ట్రైన్ రాగానే 10-12 మంది ప్రయాణికులు ట్రైన్ నుంచి జారిపడగా, అదే సమయంలో పక్కనే ఉన్న పట్టాలపై ఎక్స్ప్రెస్ రైలు వేగంగా దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై లోకల్ రైళ్ల కోసం తయారు చేసే అన్ని కొత్త ట్రైన్ కంపార్ట్మెంట్లలో ఆటోమ్యాటిక్ డోర్స్ పెడతామని చెప్పింది. అంతేగాక, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ట్రైన్ కంపార్ట్మెంట్లను కూడా రీడిజైన్ చేసి, ఆలోమ్యాటిక్ డోర్ క్లోజింగ్ సిస్టమ్ను తీసుకొస్తామని రైల్వే పేర్కొంది.
Also Read: అందుకే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని అరెస్టు చేశారు: జగన్ సంచలన కామెంట్స్
హైదరాబాద్ మెట్రో రైళ్లు స్టేషన్ల వద్ద ఆగగానే వాటి డోర్లు ఆటోమ్యాటిక్గా కాసేపు తెరుచుకుని, మళ్లీ మూసుకుంటాయి. ఆలోపు ప్రయాకులు ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. అచ్చం ఇలాగే ముంబై లోకల్ ట్రైన్లలోనూ ఆటోమ్యాటిక్ డోర్లు తీసుకువస్తారన్నమాట.
దీంతో ట్రైన్లు కదులుతున్న సమయంలో ప్రయాణికులు ప్రమాదవశాత్తూ కింద పడకుండా ఉంటారు. సాధారణంగా ముంబై లోకల్ ట్రైన్ల నిండా జనాలు కిక్కిరిపోతుంటారు. దీంతో దాదాపు అన్ని డోర్ల వద్ద ప్రయాణికులు వేలాడుతూ ప్రయాణిస్తుంటారు. ఆ సమయంలో వారు కింద పడిపోతున్న ఘటన తరుచూ చోటుచేసుకుంటున్నాయి.