ఉరికి రెడీ…డెత్ సెల్స్ కి నిర్భయ దోషుల తరలింపు

  • Published By: venkaiahnaidu ,Published On : January 17, 2020 / 08:24 AM IST
ఉరికి రెడీ…డెత్ సెల్స్ కి నిర్భయ దోషుల తరలింపు

Updated On : January 17, 2020 / 8:24 AM IST

నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను గురువారం(జనవరి-16,2020) ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నలుగురు దోషులు పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లను ఉరితీసే ఏర్పాట్లలో బిజీగా ఉన్న తీహార్ యంత్రాంగం మొదటిసారిగా వాళ్లని అదే జైలులో ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి తరలించారు. ఈ నలుగురు దోషులను వేర్వేరు సెల్స్ లో ఉంచి, సిసిటివి ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

తీహార్ జైలు డైరెక్టరేట్ వర్గాల సమాచారం ప్రకారం…నలుగురు దోషులను ఒకేసారి ఉరిశిక్షకు తీసుకువెళతారు కాబట్టి, నలుగురు దోషులు ఎటువంటి ఇబ్బందులను సృష్టించలేని విధంగా తీవ్రమైన అప్రమత్తత మరియు శాంతి అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశచరిత్రలో తొలిసారిగా నలుగురు దోషులను ఒకేసారి ఉరితీస్తున్నారు. ఆసియాలో అతిపెద్ద జైలు అయిన తీహార్ జైలులో ఉరి పరీక్షించడానికి డమ్మీ ఉరిశిక్ష కూడా జరిగింది.

మరోవైపు నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్ అయింది. నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ హోంశాఖకు పంపిచారు. హోంశాఖ ఇవాళ ఆ పిటిషన్ ను తిరస్కరించాలని సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపింది. ముఖేష్‌సింగ్ పెట్టుకున్న క్ష‌మాభిక్ష ద‌ర‌ఖాస్తును రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ తిర‌స్క‌రించిన‌ట్లు కేంద్ర హోంశాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ముఖేష్ సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును ఒక వేళ రాష్ట్రపతి తిరస్కరించినా దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో ఈ నెల 22న ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్‌ జైలు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఉరిశిక్ష అమలు చేయడానికి ముందు దోషులకు తప్పనిసరిగా 14 రోజుల ఉపశమనం ఇవ్వబడుతుంది. దీంతో ఈ నెలాఖరులో గానీ లేదా వచ్చే నెల ప్రారంభంలో కానీ దోషులను ఉరితీసే అవకాశముంది.

దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.