వాహనదారులు అలర్ట్ : జనవరి 01 నుంచి FASTag తప్పనిసరి
No cash at toll plazas from 2021 : కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించి మార్పులు చేసిన నిబంధనలు కొత్త సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి. జనవరి 1 నుంచి టోల్గేట్ల (Toll Plazas) వద్ద ఫాస్టాగ్ (FASTag) తప్పనిసరి కానుంది. అలాగే ల్యాండ్లైన్ నుంచి మొబైల్కు కాల్ చేసేటప్పుడు జీరోను ముందుగా డయల్ చేయాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి టోల్ గేట్ల వద్ద నగదు లావాదేవీలు ఉండవు. అన్నీ ఫాస్టాగ్ (FASTag) ద్వారానే జరగనున్నాయి.
వచ్చే ఏడాది ప్రారంభం నుంచే.. టోల్ గేట్ల వద్ద పన్నుల్ని వంద శాతం ఫాస్టాగ్ ద్వారానే వసూలు చేయాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో ఫాస్టాగ్ తప్పనిసరి అయింది. కొత్త సంవత్సరంలో ఊరికెళ్లాలనుకునే వారు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా తీసుకోండని అధికారులు చెప్తున్నారు.
వాహనాల విండ్స్క్రీన్పై ఉంచే ఫాస్టాగ్ స్టిక్కర్ లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది టోల్ ప్లాజాలోని స్కానర్కు నేరుగా కనెక్ట్ అవుతుంది. వాహనదారుల ఖాతా నుంచి డబ్బులు ఆటోమెటిగ్గా కట్ అవుతాయి. ఇప్పటికే ఫాస్టాగ్ ((FASTag)) లేని వాహనాలను మార్షల్ లైన్లోకి అనుమతించడం లేదు. జనవరి 1 నుంచి ఆ ట్యాగ్ లేకుండా అసలు ఏ లైన్లోకి వెళ్లే అవకాశం ఉండదు. వీటితో పాటు పాజిటివ్ పే సిస్టమ్, కాంటాక్ట్లెస్ కార్డు లావాదేవీల పెంపు, జీఎస్టీ రిటర్న్స్ వంటి నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ను నియంత్రించాలనే ఉద్దేశ్యంతో ఫాస్టాగ్ విధానాన్ని 2017 నుంచి కేంద్రం అమలు చేస్తోంది. 2019 అక్టోబర్లో దేశవ్యాప్తంగా..ఈ విధానాన్ని తప్పనిసరి చేసింది. ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలతో పాటు..పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు వచ్చింది. వచ్చే ఏడాది నుంచి అన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి అయ్యింది. ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించాలంటే..ఫాస్టాగ్ తప్పనిసరి అని తాజా నిబంధనల్లో వెల్లడించారు. అలాగే థర్డ్ పార్టీ బీమా తీసుకోవాలన్నా..ఫాస్టాగ్..తీసుకోవాలన్న నిబంధనను వచ్చే ఏడాది ఏప్రిల్ 01 నుంచి అమలు చేయనున్నారు. సో..మొత్తంగా..టోల్ ప్లాజాల వద్ద ఇక నూరు శాతం ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు జరుగనున్నాయి.