2021 దాకా కరోనా వ్యాక్సిన్ రాదు : సౌమ్య స్వామినాథన్

కరోనాకు 2021 కంటే ముందుగా వ్యాక్సిన్ సిద్ధమయ్యే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ఆగస్టు 15వ తేదీ లోపు అందుబాటులోకి రావాలని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆదేశాలివ్వడంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పై విధంగా స్పందించింది. మరోవైపు, వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తికావడానికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. కొవాగ్జిన్, జైకోవ్-డీతో పాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలిపింది. ‘కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం 6 భారతీయ ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
కొవాగ్జిన్, జైకోవ్-డీ వ్యాక్సిన్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 140 వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయి. ఇందులో 11 వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. ఇందులో ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదు’ అని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓ ప్రకటనలో వెల్లడించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) నుంచి హ్యూమన్ ట్రయల్స్ కోసం కొవాగ్జిన్, జైకోవ్-డీకు అనుమతులు లభిస్తే, అది కరోనా అంతమయ్యే క్రతువుకు ఆరంభ సూచకమని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ 2021లోపు వచ్చే అవకాశం లేదని కేంద్ర శాస్త్రసాంకేతికశాఖ పేర్కొంది. దీనికి కారణాల్ని కూడా వివరించింది. వ్యాధిని కట్టడి చేసే వ్యాక్సిన్ అభివృద్ధి మూడు దశల ట్రయల్స్లో జరుగుతుంది. తొలి రెండు దశల్లో వ్యాక్సిన్ సురక్షితమా? కాదా? అనే వాటిపై పరీక్షలు జరుపుతారు. మూడో దశలో వ్యాక్సిన్ సమర్థతపై పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో దశ పూర్తికావడానికి నెలల నుంచి సంవత్సరాల సమయం పడుతుంది.
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’, జైడూస్ కాడిలా సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకోవ్-డీ’ వ్యాక్సిన్లకు తొలి రెండు దశల ట్రయల్స్ నిర్వహించడానికి ఈ వారంలోనే అనుమతులు లభించాయి. దీన్నిబట్టి చూస్తే ఆయా వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో పరీక్షలు జరుపుకోవాలంటే కొన్ని నెలల సమయం పట్టొచ్చు. ఈ కారణంగానే కేంద్రం 2021 కంటే ముందు వ్యాక్సిన్ రాకపోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఏ వ్యాక్సిన్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నా ట్రయల్స్ నిర్వహించడం ముఖ్యమని, దీనికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం అన్ని జరిగితేనే ఇది సాధ్యమని వెల్లడించారు. ఐసీఎంఆర్ తాజా ప్రకటన నేపథ్యంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. కరోనా టీకా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని పరోక్షంగా వివరించారు.
Read:హైడ్రాక్సీ, హెచ్ఐవీ డ్రగ్స్పై ట్రయల్స్ నిషేధం