పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం..9 మందికి గాయాలు

odisha:ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని పెట్రోల్ బంకు లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. రాజ్భవన్కు సమీపంలో ఉన్న ఐవోసీఎల్ పెట్రోల్ బంకులో జరిగిన ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని…కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజ్కు తరలించారు.
ప్రమాద స్థలానికి అయిదు అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను అదుపుచేశాయి. మంటల వల్ల ఏర్పడిన పేలుడుతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఐఓసీఎల్ కు చెందిన సీనియర్ అధికారులు, పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పేలుడు ధాటికి రాజ్ భవన్లోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. పేలుడు శబ్దం 3 కిలోమీటర్లు దూరం వరకు వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు వివరించారు. అగ్నిప్రమాదం కారణంగా ఏర్పడిన పేలుడుకు సమీపంలోని భవానాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. మంటల వల్ల ఏర్పడిన పేలుడు శబ్దానికి మరో 3 గంటల వరకు తనుక ఏమీ వినిపించలేదని ఘటనా స్ధలం వద్ద ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి చెప్పాడు.
భూగర్భంలో ఉన్న ట్యాంకులకు మంటలు వ్యాపించక పోవటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఇవికాక ….ఘటనా స్థలంలో పెట్రోల్, డీజిల్తో నిండి ఉన్న మరో రెండు ట్యాంకులు ఉన్నాయని, వాటి వైపు మంటలు వ్యాపించకుండా ఉండటానికి తాము ప్రాధాన్యం ఇచ్చామని పోలీస్ కమిషనర్ సారంగి తెలిపారు. ఆ రెండు ట్యాంకులను వెంటనే ఖాళీ చేయించాలని ఐఓసీఎల్ అధికారులకు సూచించినట్లు తెలిపారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్…… గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరపాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు.