PM Modi : ఫైనల్లో భారత్ ఓటమి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi On India Defeat : ఆసీస్ చేతిలో భారత్ పరాజయం అనంతరం ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు.

PM Modi : ఫైనల్లో భారత్ ఓటమి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi On India Defeat (Photo : Google)

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. యావత్ దేశం మీతోనే ఉంటుంది.. ఈరోజు, రేపు, ఎలప్పుడూ.. అని ప్రధాని మోదీ అన్నారు. ఆసీస్ చేతిలో భారత్ పరాజయం అనంతరం ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు. ఆటలో గెలుపోటములు సహజం అని, ఓటమి పాలైనంత మాత్రాన నిరుత్సాహ పడిపోవాల్సిన అవసరం లేదని అర్థం వచ్చేలా ప్రధాని మోదీ స్పందించారు.

”డియర్ టీమిండియా.. ప్రపంచ కప్ లో గొప్ప ప్రదర్శన కనబరిచారు. ఈ టోర్నీ మొత్తం మీ ప్రతిభ, సంకల్పం అద్భుతం, అమోఘం. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడారు. దేశం గర్వించేలా చేశారు. ఈ దేశ ప్రజలు ఈరోజు, ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు” అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ ని ప్రధాని మోదీ స్వయంగా స్టేడియంకు వచ్చి వీక్షించారు.

Also Read : అప్పుడు, ఇప్పుడు విల‌న్ ఆస్ట్రేలియానే.. భార‌త్‌కే ఎందుకిలా జ‌రుగుతోంది..?

అదే సమయంలో వన్డే వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియాను అభినందించారు ప్రధాని మోదీ. ” ప్రపంచ కప్ లో అద్భుతమైన విజయం సాధించిన ఆస్ట్రేలియాకు అభినందనలు. ఈ టోర్నమెంట్ లో ప్రశంసనీయమైన ప్రదర్శన చూపారు. అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఈరోజు అద్వితీయమైన ఆట ఆడిన ట్రావిస్ హెడ్‌కు నా ప్రత్యేక అభినందనలు” అని ప్రధాని మోదీ మరొక పోస్టులో ఆసీస్ కు విషెస్ తెలియజేశారు.

భారత్ ఓటమికి ప్రధాన కారణం ఆసీస్ ఓపెనర్ హెడ్ అని చెప్పొచ్చు. హెడ్ అద్భుతమైన సెంచరీతో మ్యాచ్ ను పూర్తిగా కంగారులవైపు తిప్పేశాడు. 120 బంతుల్లో 137 పరుగులతో(15*4, 4*6)  జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. మరో ఎండ్ లో లబూ షేన్ హాఫ్ సెంచరీతో(110 బంతుల్లో 58 పరుగులు నాటౌట్) అదరగొట్టాడు.

Also Read : శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నం.. ఇలా జ‌రిగి ఉండాల్సింది కాదు.. మ‌రో 20-30 ప‌రుగులు చేసుంటే..!

కాగా, సెప్టెంబర్ లో సౌతాఫ్రికాలో ట్రావిస్ హెడ్ కి తీవ్ర గాయమైంది. అతడి చెయ్యి విరిగింది. ఆ గాయం కారణంగా అతడు వరల్డ్ కప్ కు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఆస్ట్రేలియా జట్టు హెడ్ ని వదులుకోలేదు. అతడు ఫిట్ గా మారి ఆడేవరకు అలానే ఉంచుకుంది. తనపై జట్టు ఉంచిన నమ్మకాన్ని హెడ్ వమ్ము చేయలేదు. ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విశ్వవిజేతగా నిలిపాడు.

తుది పోరులో ఆసీస్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. పదునైన బంతులతో భారత బ్యాటర్లను కట్టడి చేశారు. మిచెల్ స్టార్క్(3-55), పాట్ కమిన్స్(2-34) టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. ఇక, వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లలో హెడ్ 3వ వాడు. గతంలో 2003 వరల్ కప్ ఫైనల్లో భారత్ పై రికీ పాంటింగ్ శతకం(140*) బాదాడు. ఇక 2007 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై ఆడమ్ గిల్ క్రిస్ట్ సెంచరీ(149) చేశాడు. వారిద్దరి తర్వాత వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేసిన ఆసీస్ క్రికెటర్ గా ట్రావిస్ హెడ్ ఘనత సాధించాడు.

ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతూ ఓటమే ఎరుగని జట్టుగా ఫైనల్లోకి అడుగు పెట్టిన భారత్.. తుదిపోరులో చతికలబడింది. ఫైనల్ లో భారత బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన.. 50 ఓవర్లలో 240 పరుగులే చేసింది.