ఈ రోజు భారతదేశం మొత్తం ఆనందంగా ఉంది.. ప్రతి హృదయం పులకరిస్తుంది- ప్రధాని మోడీ

అయోధ్య నగరంలో కొత్త అధ్యాయం మొదలైంది. 492 ఏళ్ల పోరాటం తర్వాత రామభక్తుల శతాబ్ధాల అగ్నిపరీక్ష పూర్తి అయ్యింది. రామాయణ ఉత్తరకాండలో మరో శకం మొదలైంది. విశిష్ట ముహూర్తం.. విశిష్ట వ్యక్తుల మధ్య.. వేద మంత్రాల నడుమ విశిష్ట భూమిపూజ నరేంద్ర మోడీ చేతులమీదుగా జరిగింది. ఈ కార్యక్రమ వేదికపై ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ నృత్య గోపాల్ దాస్ సహా ఐదుగురు మాత్రమే ఉన్నారు.
ఈ సంధర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. జై శ్రీరామ్ నినాదం చేస్తూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ రోజు ఈ జై శ్రీరామ్ నినాదం ప్రపంచమంతా ప్రతిధ్వనించిందని ఆయన అన్నారు. దేశ ప్రజలందరికీ, రామ్ భక్తులకు ఈ సంధర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నాకు ఇవ్వడం నా అదృష్టం అని అన్నారు.
ఈ రోజు భారతదేశం మొత్తం అందంగా, ఆనందంగా కనిపిస్తుంది అని మోడీ అన్నారు. ప్రతి హృదయం ఉప్పొంగిపోతుందని, శతాబ్దాల నిరీక్షణ ఈ రోజు ముగిసిందని మోడీ అన్నారు. నేడు భారతదేశం మొత్తం ఉద్వేగభరితంగా మారిపోయింది అని అన్నారు. శతాబ్దాలు తర్వాత రామ్ జన్మభూమి విముక్తి పొందిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రామ్ ఆలయం కోసం అనేక తరాలు శతాబ్దాలుగా కష్టపడ్డాయని గుర్తు చేశారు. రామ్ ఆలయం కోసం తపస్సు చేసిన ఒక్కరికి వందనం చేస్తున్నట్లు మోడీ చెప్పారు.