Narendra Modi: ఆగస్టు 6న రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన ప్రధాని మోదీ.. ఇంతకీ ఆరోజు ఏం చేయనున్నారో తెలుసా?
నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానంతో ఈ స్టేషన్లను 'సిటీ సెంటర్స్'గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు సహా పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి
![Narendra Modi: ఆగస్టు 6న రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన ప్రధాని మోదీ.. ఇంతకీ ఆరోజు ఏం చేయనున్నారో తెలుసా? Narendra Modi: ఆగస్టు 6న రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన ప్రధాని మోదీ.. ఇంతకీ ఆరోజు ఏం చేయనున్నారో తెలుసా?](https://10tv.in/wp-content/uploads/2023/08/Untitled-1-16.jpg)
AMRIT BHARAT STATIONS: ఆగస్టు 6న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ పునరాభివృద్ధి పని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతుంది. వాస్తవానికి ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 1309 స్టేషన్లను పునరాభివృద్ధి చేయాల్సి ఉంది. అందులో భాగంగా 500లకు పైగా ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. కాగా, రైల్వేలో ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఇదే మొదటిసారి.
ఈ పథకం కింద 508 స్టేషన్ల పునరాభివృద్ధికి మొత్తం 24,470 కోట్ల రూపాయలకు పైగా అవుతుంది. నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానంతో ఈ స్టేషన్లను ‘సిటీ సెంటర్స్’గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు సహా పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో చెరో 55, బీహార్లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్లో 37, మధ్యప్రదేశ్లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్లో 22, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున, జార్ఖండ్లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18 చొప్పున, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.
ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ రైల్వే స్టేషన్లను సిద్ధం చేయనున్నారు. అధునాతనంగా రూపొందించబడిన ట్రాఫిక్ సౌకర్యంతో పాటు, ఇంటర్ మోడల్ రిజిస్టర్ తో వీటిని తీర్చిదిద్దనున్నారు. స్టేషన్ భవనాల రూపకల్పన స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రైల్వే స్టేషన్ సదరు నగర అందాలను ప్రతిబింబిస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.