న్యూఇయర్ పార్టీ ఇన్విటేషన్లో కండోమ్, ఓఆర్ఎస్ ప్యాకెట్.. పబ్ నిర్వాహకులకు దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు
న్యూ ఇయర్ పార్టీ వేడుకల వేళ ఓ పబ్ ఇచ్చిన ఆహ్వానం చర్చనీయంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకిదిగి పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు .

Pune pub
New Year Party invitation: 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా యువత మంగళవారం రాత్రి, బుధవారం జోరుగా పార్టీలు చేసుకునేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఈవెంట్లు, పార్టీల పేరుతో క్యాష్ చేసుకునేందు పబ్ లు, క్లబ్ లు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ పార్టీకి సంబంధించి ఓ పబ్ ఇచ్చిన ఆహ్వానం చర్చనీయంగా మారింది. దీంతో పబ్ తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల మాటున ఇదేం పాడుపని అంటూ మండిపడుతున్నారు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా మహారాష్ట్రలోని పూణె నగరంకు చెందిన ఓ పబ్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీకి సంబంధించి సదరు పబ్ నిర్వాహకులు ఇచ్చిన ఇన్విటేషన్ లో కండోమ్ ప్యాకెట్ తోపాటు ఓఆర్ఎస్ ను పంపించారు. దీంతో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు పబ్ నిర్వాహకుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేత అక్షయ్ మాట్లాడుతూ.. పబ్, నైట్ లైఫ్ కు తాము వ్యతిరేకం కాదు. కానీ, యూత్ పబ్ కు వచ్చేలా ఇలాంటి చెత్త మార్కెటింగ్ వ్యూహాలతో వారిని చెడుమార్గంలో పయనించేలా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. సదరు పబ్ పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, పబ్ ను మూసివేయాలని, పబ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఇన్విటేషన్ కార్డును అందుకున్న పలువురిని పిలిచి విచారించినట్లు పోలీసులు తెలిపారు. పబ్ నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పబ్ లో మంగళ, బుధవారాల్లో నిర్వహించే ఈవెంట్లను రద్దు చేయాలని సదరు పబ్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.