ప్రభుత్వ ఏర్పాటుపై సోనియాతో మాట్లాడలేదు: శరద్ పవార్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శరద్ పవార్ వ్యాఖ్యలు మరింత ఉత్కంఠతను పెంచాయి. ఢిల్లీలోని టెన్ జన్పథ్లో సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అనంతరం దీనికి సమాధానం దొరుకుతుందని ఎదురుచూశారంతా. అందరికీ షాక్ ఇస్తూ.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయమై తాము చర్చించలేదన్నారు.
శివసేనతో పొత్తు అంశాన్ని సోనియా వ్యతిరేకించారా అని అడిగిన ప్రశ్నకు ఈ భేటీలో కాంగ్రెస్-ఎన్సీపీకి సంబంధించిన అంశాలనే చర్చించాం. ఏకే ఆంటోనీ కూడా భేటీలో పాల్గొన్నాన్నారు. కేవలం మహారాష్ట్రలోని రాజకీయ పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడామని ఇరు పార్టీల నేతలు భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరుపుతారని ఆయన తెలిపారు.
అమిత్ షాతో మాట్లాడిన అనంతరం రిపబ్లికన్ పార్టీ ఎంపీ రామ్దాస్ అథవాలే మాట్లాడుతూ.. మహారాష్ట్ర రాజకీయాల విషయమై తొందరేం లేదని, అంతా సర్దుకుంటుందని షా చెప్పారన్నారు. బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అథవాలే ఆశాభావం వ్యక్తం చేశారు. శివసేన మనసు మార్చుకుంటుందని.. శివసేనకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని ఆయన తెలిపారు.