ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటన.. వెలుగులోకి మరో షాకింగ్ వీడియో..!

ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో కోచింగ్ సెంటర్లపై ఎంసీడీ చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా బేస్‌మెంట్‌లో ఉన్న 8 కోచింగ్‌ సెంటర్లను గుర్తించి వాటిలో మూడింటికి సీల్‌ వేశారు ఎంసీడీ అధికారులు.

ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటన.. వెలుగులోకి మరో షాకింగ్ వీడియో..!

Delhi Ias Coaching Centre Flood Incident (Photo Credit : Google)

Updated On : July 29, 2024 / 1:48 AM IST

Delhi Ias Coaching Centre Flood Incident : దేశ రాజధాని ఢిల్లీలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనకు సంబంధించి తాజాగా మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. కోచింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న రోడ్డుపై భారీగా వరద నీరు చేరగా ఓ SUV వాహనం చాలా వేగంగా నీటిలో వెళ్లింది. ఈ క్రమంలో వాటర్ ఫోర్స్ కి కోచింగ్ సెంటర్ గేటు ఊడిపోయింది. దీంతో పెద్ద ఎత్తున నీరు సెల్లార్ లోకి ప్రవేశించి ప్రమాద తీవ్రతను పెంచిందని అధికారులు తెలిపారు.

మరోవైపు ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో యూపీఎస్సీ అభ్యర్థులు క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రావూస్ యూపీఎస్సీ కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్ లైబ్రరీలో వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన శ్రేయా యాదవ్(25), బీహార్ కు చెందిన తాన్యా సోని(25), కేరళలోని ఎర్నాకులం వాసి నెవిన్ దల్విడ్(28) ఉన్నారు. కోచింగ్‌ సెంటర్‌ యజమాని, కోఆర్డినేటర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు FIR నమోదు చేశారు. కోచింగ్ సెంటర్ యాజమాన్యం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలన్నారు.

యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. విద్యార్థులు మృతి ఘటన దురదృష్టకరం అని, దేశ రాజధానిలో ఇలాంటి ఘటన ఆమోదయోగ్యం కాదని ఎల్జీ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరగాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా కోరారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిపై విచారణ చేయాలని.. డ్రైనేజీని ఎందుకు శుభ్రం చేయలేదనే దానిపై విచారణ చేయాలని కోరారు.

ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో కోచింగ్ సెంటర్లపై ఎంసీడీ చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా బేస్‌మెంట్‌లో ఉన్న 8 కోచింగ్‌ సెంటర్లను గుర్తించి వాటిలో మూడింటికి సీల్‌ వేశారు ఎంసీడీ అధికారులు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని, ఘటనపై చర్యలు తీసుకుంటామని యూపీఎస్సీ విద్యార్థులకు హామీ ఇచ్చారు MCD అడిషనల్ కమిషనర్ తారిక్ థామస్. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, మేజిస్ట్రియల్ విచారణకు ఆదేశించిందని యూపీఎస్సి విద్యార్థులకు తెలిపారు.

Also Read : ఆమెది తెలంగాణ కాదు..! ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంట‌ర్‌ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ ఆరా