ఇందిరా గాంధీ హాస్పిటల్లో మరో కరోనా పేషెంట్

కరోనా వైరస్ అనుమానంతో ఓ పేషెంట్ ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్(ఐజీఎంసీ)లో జాయిన్ అయ్యాడు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. బిలాస్పూర్కు చెందిన 32ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం గొంతునొప్పితో బాధపడుతున్నాడని ఐజీఎంసీ సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్ జనక్ రాజ్ తెలిపారు.
ఈ వ్యక్తి దక్షిణకొరియా నుంచి ఫిబ్రవరి 29న భారత్కు వచ్చాడు. ‘అతనికి గొంతు నొప్పి మాత్రమే ఉంది. మిగిలిన లక్షణాలేమీ తేడాగా లేదు. ఐజీఎంసీలో డయాగ్నోస్టిక్ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాం’ అని సూపరిండెంట్ అన్నారు. అతని నుంచి శాంపుల్స్ తీసుకుని టెస్టింగ్ కోసం పంపారు.
భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6కి చేరింది. గత నెలలో కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ వైరస్ కు ప్రధానకేంద్రమైన చైనాలోని వూహాన్ సిటీ నుంచి వచ్చినవాళ్లే.
సోమవారం(మార్చి-2,2020)దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి,ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. రాజస్థాన్ పర్యటనకు వచ్చిన ఓ ఇటలీ దేశస్థుడికి కూడా కరోనా సోకినట్లు సోమవారం నిర్థారణ అయింది. దీంతో భారత్ లో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఆరుకి చేరింది.