CM M K Stalin : కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం .. సోనియా, రాహుల్ గాంధీలకు సీఎం స్టాలిన్ అభినందనలు
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

Karnataka Election Results
Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం ఖరారు అయ్యింది. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కాంగ్రెస్ యత్నాలు చేసుకుంటోంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించటం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అభినందనలు తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీలకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు తమిళనాడు సీఎం స్టాలిన్.
కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకకు ఎన్నికలు జరుగగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 113 సాధించాల్సి ఉంది. వాటిలో దాదాపు 100 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దాదాపు మరో 40 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. మొత్తం 140 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా దూసుకుపోతోంది. దీంతో దక్షిణ భారతంపై పట్టు సాధించాలనుకున్న బీజేపీ చతికిలపడింది. గత ప్రభుత్వాన్ని కూలగొట్టు అధికారంలోకి వచ్చిన బీజేపీ అది కూడా కోల్పోయింది. దీంతో దక్షిణ భారతంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కూడా కోల్పోయింది.
విజయం ఇక నామమాత్రపు ప్రకటనే. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సన్నాహాలు చేస్తోంది. దీని కంటే ముందు తమ అభ్యర్ధులను బెంగళూరు తరలిచింది. విజయంపై ఆనందంలో తేలిపోతున్న కాంగ్రెస్ సీఎల్పీలో సీఎం అభ్యర్థిని ఎంపిక చేయనుంది. సీఎం రేసులో ప్రధానంగా కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఉన్నారు. కానీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందో వారే సీఎం అని స్పష్టచేశారు.
కాగా..కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర నేతలు మొదటి నుంచి ధీమా వ్యక్తంచేశారు. కానీ ఇంత ఘన విజయం వస్తుందని వారు కూడా ఊహించలేదు. కర్ణాటకలో ఎలాగైనా పట్టు సాధించాలని ముఖ్యంగా దక్షిణాదిపై పట్టు కోసం కన్నడనాటే శ్రీకారం చుట్టాలని బీజేపీ ఆశించింది. కానీ కన్నడిగులు బీజేపీకీ ఝలక్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా బీజేపీ విజయాలతో దూసుకుపోతుంటే కాంగ్రెస్ పరాజయాలతో బేజారెత్తిపోయింది. మోదీ ప్రాభవం ముందు కాంగ్రెస్ వెలవెలబోవటంతో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందన్నట్లే ఉంది పరిస్థితి. ఇక కాంగ్రెస్ విజయాలపై ఆశలు వదిలేసుకుందా? అనే తరుణంలో కన్నడ ప్రజలు కనీ వినీ ఊహించని విజయాన్ని కట్టబెట్టారు హస్తం పార్టీకి. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేక ఫలితాలు వచ్చినా కర్ణాటకలో పట్టు కోసం తన శక్తియుక్తుల్ని పెట్టింది కాంగ్రెస్. అలా కాంగ్రెస్ కష్టం వృథా పోలేదు. కర్ణాటక ఘన విజయంతో బీజేపీని మట్టి కరిపించారమన్న ఆనందం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది.
ఈ విజయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు ఫోన్ చేసి మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల సరళి పట్ల సోనియా, రాహుల్ లకు ఆయన అభినందనలు తెలిపారు. అటు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యలకు కూడా స్టాలిన్ ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు.