దేశంలో మొదటి సారి : రైలు ఆలస్యానికి పరిహారం

ఇచ్చిన మాట ప్రకారం IRCTC రైలు ఆలస్యం అయినందుకు ప్రయాణికులకు నష్ట పరిహారం చెల్లిస్తోంది. దేశంలో ప్రారంభమైన తొలి ప్రయివేటు రైలు తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభమైనప్పడు… ఒక వేళ ఏదైనా కారణంతో రైలు ఆలస్యం అయితే అందుకు పరిహారం చెల్లిస్తామని ఐఆర్సీటీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైలు గంట ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు 100 రూపాయలు, రైలు 2 గంటలకు పైగా ఆలస్యంగా వస్తే 250 రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రారంభించేటప్పుడే ప్రకటించారు. ఈ రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులకు 25 లక్షల రూపాయల ఫ్రీ ఇన్సూరెన్స్ కూడా ప్రకటించింది.
లక్నో న్యూ ఢిల్లీ మధ్య తిరిగే తేజస్ రైలు శనివారం అక్టోబరు 19వ తేదీన, 2 గంటలు ఆలస్యంగా నడిచింది. దీంతో రైలులో ప్రయాణించిన ప్రయాణికుందరికీ సంస్ధ నష్టపరిహారం చెల్లిస్తోంది. ఇందుకు సంబంధించి రైలులో ప్రయాణించిన ప్రయాణికుల మొబైల్ ఫోన్లకు ఒక వెబ్ లింకును పంపించింది. ఆలింక్ ద్వారా ప్రయాణికులు పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ చీఫ్ రీజనల్ మేనేజర్ అశ్విని శ్రీవాస్తవ చెప్పారు. శనివారం లక్నో నుంచి ఢిల్లీకి రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరిన తేజస్ ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలోనూ రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లేటప్పుడు 451 మంది, తిరుగు ప్రయాణంలో 500 మంది ప్రయాణికులు ప్రయాణించారు. రైలు ఆలస్యమైనందుకు అందులోని ప్రయాణికులకు పరిహారం అందించడం దేశంలో ఇదే మొదటిసారి.
ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికుల సామాగ్రి చోరీ అయినా లేక ప్రయాణికుల వస్తువులు ఏవైనా దోపిడీ జరిగినా కూడా లక్ష రూపాయల బీమా వర్తిస్తుంది. అక్టోబర్ 4వ తేదీన ఈ రైలు ప్రారంభమైంది. వారంలో ఆరు రోజులు లక్నో న్యూ ఢిల్లీ మధ్య ఈ రైలు నడుస్తుంది. తేజస్ రైలులో ఓఆర్ మిషన్ ద్వారా నీళ్లను, వెండింగ్ మిషన్ ద్వారా టీ, కాఫీని పొందవచ్చు. ఈ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ టికెట్ ధర 1280 రూపాయలు కాగా ఏసీ చైర్ టికెట్ ధర 1125 రూపాయలుగా ఉంది.