ప్రేమ కోసం..ప్రియుడికోసం 200 కిలోమీటర్లు నడిచిన ప్రియురాలు
ప్రేమలో మాధుర్యం ప్రేమించిన వాళ్లకే తెలుస్తుందిట.. ప్రేమ కాన్సెప్ట్ తో ఎన్నిసినిమాలు వచ్చాయో…ఎన్నికావ్యాలు, నవలలు వచ్చాయో చెప్పలేము. టిక్టాక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడిని ప్రేమించిన యువతి….. అతడి కోసం 200 కిలోమీటర్లు నడిచి వచ్చింది. తంజావూరు నుంచి మధురై వరకు దాదాపు 200 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన యువతి చేసిన టిక్టాక్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తంజావూరు ప్రాంతానికి చెందిన యువతికి టిట్టాక్ ద్వారా మదురై ఆరపాలయంకు చెందిన యువకుడితో పరిచయమైంది. ఆమె.. అతడిని వన్సైడ్గా ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు ప్రేమకు అంగీకరించక…. ఆమెతో టిక్ టాక్ చేయడాన్ని నిలిపివేశాడు. అయినా ఆమె మాత్రం అతనిపై ప్రేమను పెంచుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్ డౌన్తో 144 సెక్షన్ అమలులో ఉన్నా.. ఆ యువకుడిని చూడడానికి ఆమె మదురైకు నడిచి వస్తున్నట్టు టిక్టాక్ ద్వారా వీడియో పెట్టింది. తంజావూరు నుంచి మదురైకి సుమారు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒంటరిగా నడిచి వస్తూ, ప్రేమ పాటలు పాడుతూ..ఏ ప్రాంతంలో ఉందో తెలిపే విధంగా వీడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది.
సోమవారం, ఏప్రిల్ 27 మధ్యాహ్నం ఆమె మదురై జిల్లా మేలూర్ సమీపంలో నడిచి వస్తున్నానని… తనను బైక్పై తీసుకు వెళ్లాలని ఆ యువకుడిని కోరింది. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు ఆమెకు సూచనలు ఇస్తుండగా, కొందరు ఆమెను దూషిస్తూ పోస్టులు పెట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.