రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్, నేటి నుంచి మారుమూల ప్రాంతాల్లోనూ టికెట్ బుకింగ్ కౌంటర్లు
రైలు ప్రయాణికులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ వినిపించింది. టికెట్ల కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా చర్యలు

రైలు ప్రయాణికులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ వినిపించింది. టికెట్ల కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా చర్యలు
రైలు ప్రయాణికులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ వినిపించింది. టికెట్ల కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. మారుమూల ప్రాంతాల్లోనూ టికెట్ బుకింగ్ కౌంటర్లు రీ ఓపెన్ కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో శుక్రవారం(మే 22,2020) నుంచి రైలు టికెట్ల బుకింగ్ పునఃప్రారంభం కానుందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ఇందులో భాగంగా కంప్యూటర్లు, ఇంటర్నెట్ సరిగ్గా అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లోనూ కామన్ సర్వీస్ సెంటర్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన మరికొన్ని రైల్వే స్టేషన్లలోనూ రెండు, మూడు రోజుల్లో టికెట్ బుకింగ్ కౌంటర్లు ప్రారంభం కానున్నాయన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కౌంటర్ల దగ్గర జనం గుమికూడరాదన్నదే తమ లక్ష్యమని, ఇందుకు అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
త్వరలోనే పట్టాలపైకి మరిన్ని రైళ్లు:
త్వరలోనే మరిన్ని రైళ్లను కూడా ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. జూన్ 1 నుంచి నడిచే 200 ఏసీ, నాన్ ఏసీ రైళ్ల కోసం గురువారం(మే 21,2020) బుకింగ్స్ ప్రారంభమైన రెండున్నర గంటల్లోనే 4 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారన్నారు. మే 1 నుంచి ఇప్పటి దాకా 2,050 శ్రామిక్ రైళ్ల ద్వారా 30 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించినట్లు తెలిపారు. శ్రామిక్ రైళ్ల విషయంలో పశ్చిమబెంగాల్, జార్ఖండ్ ప్రభుత్వాలు సహకరించడం లేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలు తమ కార్మికులు సొంతూళ్లకు చేరుకునేందుకు సహకరించాలన్నారు. రైల్వే శాఖ ఇప్పటిదాకా 225 స్టేషన్లలో ఉన్న 5 వేల బోగీలను కోవిడ్-19 కేర్ సెంటర్లుగా మార్చిందని తెలిపారు.
రైల్వే కౌంటర్లలోనూ టికెట్ల విక్రయం:
రైలు టికెట్ల కోసం గురువారం (మే 21) ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శుక్రవారం ఉదయం నుంచి కామన్ సర్వీస్ సెంటర్లలోనూ టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇక రెండు, మూడు రోజుల్లో రైల్వే కౌంటర్లలోనూ టికెట్ల విక్రయం ప్రారంభిస్తామని కేంద్రం తీపి కబురు అందించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంపిక చేసిన రైల్వే కౌంటర్లలోనే ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి సంకేతం ఇచ్చారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. క్రమంగా రైళ్ల సంఖ్యను పెంచే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
హాట్ కేకుల్లా రైలు టికెట్లు:
ఇక రైల్వే స్టేషన్లలో దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అయితే.. టేక్ అవేకు సంబంధించిన దుకాణాలకే పర్మిషన్ ఇచ్చినట్లు వివరించారు. ప్రయాణికులకు ఆహారానికి ఇబ్బంది లేకుండా టిఫిన్ సెంటర్లు, ఫుడ్ కోర్టులకు పార్శిల్ (టేక్ అవే) సర్వీసులకు వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో రైలు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. టికెట్ల విక్రయం ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 1.5 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. చాలా రైళ్లలో వెయింటింగ్ లిస్టులోకి వెళ్లిపోయాయి. కాగా, ఆన్లైన్ సదుపాయం ద్వారా టికెట్లు కొనలేని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే కౌంటర్లలో ఈ సదుపాయం కల్పించడానికి రైల్వే శాఖ నిర్ణయించింది.
Read: మే 1 నుంచి శ్రామిక్ స్పెషల్ ట్రైన్లలో 21 మంది శిశువులు జననం