ఢిల్లీలో భారీగా కరోనా కేసుల పెరుగుదలకు యూకే వేరియంటే కారణం

ఢిల్లీలో ఒక్కసారిగా క‌రోనా కేసులు భారీగా పెరిగిపోవ‌డానికి బ్రిటన్ రకం వేరియంటే కార‌ణ‌మ‌ని

ఢిల్లీలో భారీగా కరోనా కేసుల పెరుగుదలకు యూకే వేరియంటే కారణం

Uk Strain

Updated On : April 23, 2021 / 11:29 PM IST

UK Strain ఢిల్లీలో ఒక్కసారిగా క‌రోనా కేసులు భారీగా పెరిగిపోవ‌డానికి బ్రిటన్ రకం వేరియంటే కార‌ణ‌మ‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) వెల్ల‌డించింది. మార్చి నెలలో జరిపిన శాంపిళ్ల విశ్లేషణలో 50శాతం బ్రిటన్‌ వేరియంట్‌వే కావడం ఇందుకు నిదర్శనమని ఎన్‌సీడీసీ నిపుణులు అంచనా వేశారు.

దేశంలో కరోనా వైరస్‌ పరివర్తనలు, వాటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మార్చి రెండు, నాలుగు వారాల్లో ఢిల్లీలో కరోనా సోకిన వారి నమూనాలకు పరిశీలించారు. రెండో వారంలో చేపట్టిన నమూనాల్లో 28శాతం యూకే వేరియంట్‌ బయటపడగా.. అదే నెల చివరి వారంలో అవి 50శాతానికి పెరిగాయని ఎన్‌సీడీసీ డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ తెలిపారు. దీంతో దేశ రాజధానిలో వైరస్‌ విలయతాండవానికి యూకే వేరియంట్‌ కారణమై ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో బ్రిటన్‌ రకం వైరస్‌ ప్రభావమే అత్యధికంగా ఉందని సుజీత్‌ సింగ్‌ తెలిపారు.

ఢిల్లీలో ఇప్పటివరకు 15,135 నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టినట్లు ఎన్‌సీడీసీ చీఫ్‌ తెలిపారు. వీటిలో ప్రస్తుతం రెండు రకాల (B.1.617, యూకే) కరోనా వేరియంట్‌లను గుర్తించామన్నారు. మహారాష్ట్రలో వెలుగుచూసిన B.1.617 వేరియంట్‌నే డబుల్‌ మ్యుటేషన్‌గా వ్యవహరిస్తున్నారు.

అయితే సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న చాలా నగరాల్లో ఈ రకం వేరియంట్‌ కేసులే 50శాతం వెలుగుచూస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మ‌హారాష్ట్ర‌లోనూ 64 యూకే వేరియంట్ కేసులు ఉన్న‌ట్లు గుర్తించారు. తెలంగాణ‌లోనూ 170 యూకే వేరియంట్ కేసులు,57 సౌతాఫ్రికా వేరియంట్ కేసులు, మూడు డ‌బుల్ మ్యుటెంట్ కేసులు తెలంగాణ‌లో ఉన్న‌ట్లు ఎన్‌సీడీసీ తెలిపింది. ఇక,ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో మొత్తం 1644 యూకే వేరియంట్ కేసులు, 112 సౌతాఫ్రికా, 732 బ్రెజిల్ వేరియంట్ కేసులు ఉన్నాయి