అదే కుటుంబంలో ప్రాణాలు కోల్పోయిన మరో ముగ్గురు

విశాఖ షిప్ యార్డ్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. విధి ఆడిన వింత నాటకంలో కుటుంబం మరో మూడు ప్రాణాలు కోల్పోయింది. ఘటన గురించి తెలిసిన వారెవరైనా చలించిపోయేలా ఉందీ ఉదంతం.
శనివారం ఉదయం 11గంటల 50నిమిషాలకు విశాఖ పట్నం నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్యార్డులో భారీ క్రేన్ కుప్పకూలి ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల వివరాలు పరిశీలించి 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తేల్చారు. వీరిలో ఒడిస్సాకు చెందిన కార్మికుడు కూడా ఉన్నాడు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుమారుడిని కడ చూపు చూసుకునేందుకు ఆ రాష్ట్రం నుంచి కుటుంబం బయల్దేరింది. స్కార్పియోలో తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులు కూడా బయల్దేరారు. ఒడిస్సా దాటి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించాక శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జాతీయ రహదారికి సమీంచగానే వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో లారీని ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగా త్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఒడిస్సా రాష్ట్రంలోని బెంగాల్లోని ఖరగ్పూర్ వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొడుకు కడచూపుకైనా నోచుకోలేకపోయిన ఆ తల్లిదండ్రులు ఘోర రోడ్డు ప్రమాదానికి గురి కావడం మనసును కదిలిస్తోంది.