విమానంలో ప్రయాణిస్తే… ఎక్కడ కూర్చుంటే ఎక్కువ సురక్షితం? నిపుణులు ఏమంటున్నారు?
ఈ విమానంలో మొత్తం ఎనిమిది ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి

Airplane
గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన విమాన ప్రమాదంలో రమేశ్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మృత్యుంజయుడిగా నిలిచాడు. స్వల్ప గాయాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క ప్రయాణికుడు రమేశ్ విశ్వాస్.
విమానంలో అతడు 11A సీట్లో కూర్చున్నాడు. ఈ సీటు బిజినెస్ క్లాస్ కేబిన్కు వెనుక భాగంలో, ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన ఉంటుంది. అక్కడ కూర్చోవడం వల్లే రమేశ్ ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ విమానంలో మొత్తం ఎనిమిది ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి. విమాన ప్రమాదాల్లో కొన్ని స్థానాలు మరింత సురక్షితంగా ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
నిపుణుడు కీత్ టాంకిన్ చెప్పిన వివరాల ప్రకారం.. “ఎమర్జెన్సీ డోర్ పక్కన కూర్చునే ప్రయాణికుడు అత్యవసర పరిస్థితుల్లో త్వరగా బయటకు రావచ్చు. అసలు ఎక్కడి నుంచైనా సరే ప్రయాణికుడు బయటపడగలిగే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని చోట్ల నుంచి బయటకు వేగంగా రావచ్చు” అన్నారు.
విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్కు ఐదు రోలకు దగ్గరగా కూర్చున్నవారు త్వరగా బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు యూనివర్సిటీ ఆఫ్ గ్రినిచ్ అధ్యయనంలో వెల్లడైంది.
మధ్య రోలు, వెనుక భాగం సీట్లు కూడా మరింత సేఫ్ అని విశ్లేషణల ద్వారా తెలుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ప్రొఫెసర్ రికో మెర్కర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. గత ప్రమాదాల డేటా చూసినప్పుడు, విమానం వెనుకభాగంలో మధ్య సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు ప్రమాదంలో ప్రాణాపాయం జరిగిన ఘటనలు తక్కువగా ఉన్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వివరించింది.
అయితే కేవలం కూర్చున్న చోటే కాకుండా, భద్రతా సూచనల్ని పాటించడం, ఎప్పుడూ సీటుబెల్ట్ వేసుకుని ఉండడమూ కీలకమని అన్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో టర్బులెన్స్లు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రయాణ సమయంలో ఎప్పుడూ సీటుబెల్ట్ పెట్టుకోవడం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.