హస్తిన నగారా : కేజ్రీ చక్రం తిప్పేనా

  • Published By: madhu ,Published On : January 6, 2020 / 10:43 AM IST
హస్తిన నగారా : కేజ్రీ చక్రం తిప్పేనా

Updated On : January 6, 2020 / 10:43 AM IST

హస్తినలో ఎన్నికల గంట మోగింది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మరోసారి ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా ? సీఎంగా కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారా అనే చర్చలు స్టార్ట్ అయ్యాయి. మొత్తం 70 నియోజకవర్గాలున్న ఢిల్లీలో 2015లో 67 స్థానాల్లో AAP విజయదుందుభి మ్రోగించి సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు.

 

సామాన్యుడిగా వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగారు. జన్ లోక్ పాల్ బిల్లు కోసం ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హాజారే…కలిసి ఉద్యమించారు అరవింద్ కేజ్రీవాల్. 2012 నవంబర్‌లో ఆమ్ ఆద్మీ పేరిట పార్టీని స్థాపించారు. తొలిసారి ముఖ్యమంత్రిగా 49 రోజుల పాటు పదవిలో కొనసాగారు కేజ్రీ.

 

జనలోక్ పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. తర్వాత  2015 ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో విజయదుంధుబి మ్రోగించింది. రెండోసారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కానీ..MCD ఎన్నికల్లో మాత్రం ఆప్‌కు ఎదురు దెబ్బలు తగిలాయి. 

తిరిగి మరోసారి అధికారాన్ని దక్కించుకొనేందుకు కేజ్రీవాల్ సన్నద్దమౌతున్నారు. ఇప్పటికే ప్రజాకర్షక పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక్కడ పాగా వేయాలని అనుకుంటున్న బీజేపీ పాచికలను పారనీయకుండా ఆప్ నేతలు ప్లాన్ వేస్తున్నారు. కొత్త నినాదం కూడా ఎంచుకుంది.

 

ప్రజల మెదల్లోకి సులువుగా వెళ్లే విధంగా స్లోగన్ తయారు చేసింది. ‘అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్’..అంటూ కొత్త స్లోగన్‌తో ప్రచారం నిర్వహించాలని ఆప్ నిర్ణయించింది. అంటే ఐదు సంవత్సరాలు మంచిగా గడిచిపోయాయి..కేజ్రీవాల్‌‌ జిందాబాద్ అనే అర్థం వస్తుంది. 

మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్..తో ఆప్ జతకట్టింది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన రాజకీయ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్‌(ఇండియన్‌ ప్యాక్‌)తో కేజ్రీ చేతులు కలిపారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్‌ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.  ఐ-ప్యాక్‌ కూడా ధ్రువీకరించింది.

Read More : మోగింది నగారా : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

 

కేజ్రీ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. ‘మేం ఎదుర్కొన్న ప్రత్యర్థుల్లో అత్యంత కఠినమైన ప్రత్యర్థి మీరు. పంజాబ్‌ ఫలితాల తర్వాత ఈ విషయం మాకు అర్థమైంది. అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీతో చేతులు కలపడం ఆనందంగా ఉంది’ అని పేర్కొంది.  మరి కొత్త నినాదం, ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.