సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి చంద్రబాబు.. లక్ష్యం ఇదే..!

ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గడ్కరీ, నడ్డా, సీఆర్ పాటిల్ తదితర కేంద్రల మంత్రులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి చంద్రబాబు.. లక్ష్యం ఇదే..!

Cm Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట పట్టనున్నారు. బుధవారం సాయంత్రం 5గంటలకు సచివాలయం నుంచి గన్నవరం బయలుదేరుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. రాత్రి 7.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకుంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి ఢిల్లీలో పర్యటించనున్నారు చంద్రబాబు. 4వ తేదీన కేంద్ర పెద్దలను చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, తదితర అంశాలపై చంద్రబాబు చర్చిస్తారు. ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి ఇప్పటికే సేకరించారు.

కాగా, ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులతో సమీక్షించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉండనుంది.

కేంద్రం నుంచి ఏయే పథకాలు, ప్రాజెక్టుల ద్వారా నిధులు రాబట్టొచ్చనే అంశంపై చంద్రబాబు చర్చించారు. మౌలిక వసతులకు వీలైనన్ని నిధుల రాబట్టేలా రిప్రజెంటేషన్లు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రభుత్వ నివేదికలు సిద్ధం చేయించారు. గత ఐదేళ్ల కాలంలో వ్యవస్థల విధ్వంసం వల్ల ఏపీ ఏ విధంగా నష్టపోయిందోననే అంశాన్ని ప్రధాని సహా కేంద్ర మంత్రులకు వివరించనున్నారు చంద్రబాబు.

ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని కేంద్రాన్ని ద్రబాబు కోరనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రొత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. అత్యవసరంగా రోడ్లు, పోలవరం, ఆర్థిక సాయం వంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు డిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా వివిధ కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. నిర్మలా సీతారామన్, గడ్కరి, నడ్డా, సీఆర్ పాటిల్ తదితర కేంద్రల మంత్రులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ మంత్రులు భేటీ కానున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు హస్తిన వెళ్లనున్నారు.

Also Read : ఆ కేసులు రీఓపెన్..! వైసీపీ కీలక నేతలే టార్గెట్‌గా ఉచ్చు బిగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం