స్మశాన వివాదం : అమరావతి పర్యటనకు కారణం చెప్పిన చంద్రబాబు

  • Published By: chvmurthy ,Published On : November 27, 2019 / 07:59 AM IST
స్మశాన వివాదం : అమరావతి పర్యటనకు కారణం చెప్పిన చంద్రబాబు

Updated On : November 27, 2019 / 7:59 AM IST

సీఎం జగన్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే పరిస్ధితికి తీసుకొచ్చారని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడానికి మంత్రికి ఎంత అహంకారమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన.. దేశప్రతిష్టకు భంగం కలిగే పరిస్ధితికి తీసుకు వచ్చిందన్నారు. కడపలో మూడో రోజు పర్యటనలో ఉన్నఆయన  విలేకరులతో మాట్లాడుతూ… అమరావతిని చంపి, భ్రష్టుపట్టించాలనే నీచమైన పనికి శ్రీకారం చుట్టారన్నారు. వైసీపీ చేస్తున్న పనులు యువతకు అర్థం కావాలన్నారు.

అమరావతిలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలని, అందుకే రాజధాని ప్రాంతంలో గురువారం పర్యటిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ఏపీ బ్రాండ్‌ను చెడగొట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందని, ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తోందని, ఏపీ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు అన్నారు. స్పీకర్ మొదలు మంత్రులు వరకు బూతులు మట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  వారు మట్లాడే మాటలకు తిరిగి  ఏమైనా అనాలంటే సంస్కారం అడ్డు వస్తోందన్నారు.
 
రాష్ట్రంలో ఏర్పడ్డ ఇసుక కొరతతో 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఇల్లు కట్టుకుందామనుకునేవారికి ఇసుక దొరకడంలేదని చంద్రబాబు విమర్శించారు.  హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినప్పుడే…విశాఖ, విజయవాడ, తిరుపతిపై దృష్టి పెట్టామని,  విశాఖకు ఒకే ఒక్క ఐటీ సంస్థ వచ్చిందని చంద్రబాబు తెలిపారు. పట్టణ జనాభా ఉన్నచోటే అభివృద్ధి ఎక్కువ జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి  పెట్టుబడి పెట్టకుండా అమరావతి అభివృద్ధి చెందుతుందని ప్రణాళిక రూపోందించామని ఆయన తెలిపారు.

అమరావతి రూ.2లక్షల కోట్ల ఆస్తి అని చంద్రబాబు చెపుతూ… ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమవుతుందని, అప్పుడే ప్రజారాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు పెంచి… సంపద సృష్టించాలనుకున్నామని, జగన్‌ అమరావతిని చంపే దిశగా ముందుకెళ్తున్నారని విమర్శించారు. అమరావతిని కాకుండా ఈ ప్రభుత్వం ఏ సిటీని అభివృద్ధి చేస్తుందని బాబు ప్రశ్నించారు.  రాష్ట్రంలో మద్యం ధరలు విపరీతంగా పెంచారని ..టీడీపీ వారిపై దాడులు పెరిగిపోయాయని… చివరికి జర్నలిస్టులపైన కూడా దాడులు చేసే పరిస్ధితి వచ్చిందని ఆయన అన్నారు. ప్రభుత్వంపై పోరాడేందుకు మీడియా కూడా భయపడే స్థితి వచ్చిందని, జర్నలిస్టులకు అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.