Roja Selvamani : ఏపీలో రాజకీయం వేడెక్కింది. అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో సై అంటే సై అంటున్నారు. కయ్యానికి కాలుదువ్వుతున్నారు. తాజాగా మంత్రి ఆర్కే రోజా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు. దమ్ముందా? అంటూ వారికి సవాల్ విసిరారు.
ఏ కష్టమొచ్చినా ప్రభుత్వం ఉందనే ధైర్యం పేదవాడిలో ఉందన్నారు మంత్రి రోజా. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని పార్టీలకు చెందిన వాళ్లూ సంతోషంగా ఉన్నారని ఆమె చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే రావాలని ప్రజలతో పాటు అన్ని పార్టీలూ కోరుకుంటున్నాయన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చూస్తేనే ఆ విషయం అర్ధమవుతుందన్నారు.
Also Read..Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి పయనం ఎటు.. తర్వాతి అడుగు ఎటువైపు?
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ఈ సందర్భంగా ఛాలెంజ్ చేశారు రోజా. విడివిడిగా వచ్చినా పర్లేదు, ఇద్దరూ కలిసి వచ్చినా సరే.. కుప్పంలోనైనా సరే, నగరిలోనైనా సరే, పవన్ కల్యాణ్ ఓడిపోయిన చోటకైనా వెళ్దాం. మీరేం చెప్పారు? ఏ చేశారు? మేం ఏం చెప్పాం? ప్రజలకు ఏం చేశామో చర్చిద్దాం అన్నారు. ప్రజలే ఇన్ స్టంట్ గా సమాధానం చెబుతారని రోజా అన్నారు. చర్చకు వచ్చే ధైర్యం మాకుంది, మరి మీకుందా? అని ప్రశ్నించారు రోజా.