Tdp Second List : సీనియర్లకు చంద్రబాబు షాక్..! టీడీపీ రెండో జాబితాలోనూ చోటు దక్కని కీలక నేతలు వీరే

మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులు, సెకండ్ లిస్టులో 34మంది టికెట్లు కేటాయించింది టీడీపీ. ఇంకా 14 సీట్లను పెండింగ్ లో పెట్టింది.

Tdp Second List : సీనియర్లకు చంద్రబాబు షాక్..! టీడీపీ రెండో జాబితాలోనూ చోటు దక్కని కీలక నేతలు వీరే

Tdp Second List : టీడీపీ రెండో జాబితాలో సీనియర్లకు షాక్ తగిలింది. 34 మందితో విడుదలైన రెండో జాబితాలో పలువురు సీనియర్లకు సీటు దక్కలేదు. సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, కేఎస్ జవహర్, బుద్ధా వెంకన్న పేర్లు రెండో జాబితాలో లేవు. వీరి పోటీపైన గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులు, సెకండ్ లిస్టులో 34మంది టికెట్లు కేటాయించింది టీడీపీ. ఇంకా 14 సీట్లను పెండింగ్ లో పెట్టింది.

రెండో జాబితాలో ఏడుగురు మహిళలకు చోటు కల్పించింది టీడీపీ. 35ఏళ్ల లోపు వారిలో ఇద్దరు, 75ఏళ్లు పైబడిన వారిలో ఇద్దరు లిస్టులో ఉన్నారు. టీడీపీ సెకండ్ లిస్ట్ లో పీహెచ్ డీ చేసిన వారు ఒకరు, పీజీ చదువుకున్న వారు 11మంది, 10లోపు చదువుకున్న వారు ఐదుగురు ఉన్నారు. ఇక పొత్తులో భాగంగా గాజువాక టికెట్ టీడీపీకే దక్కింది. జనసేన నుంచి గాజువాక టికెట్ ఆశించి కోన తాతారావు భంగపడ్డారు. గాజువాక సీటును టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కు కేటాయించారు. మరోవైపు రెండో జాబితాలోనూ ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు కనిపించలేదు.

సెకండ్ లిస్టులోనూ గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తికి చోటు దక్కలేదు. చోడవరంలో బత్తుల తాతాయ్య బాబుకి మొండి చేయి దక్కింది. మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పివిజి కుమార్ కు నిరాశే ఎదురైంది. వైసీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంకు సత్యవేడు టికెట్ ఇచ్చింది టీడీపీ. ఇక, విజయవాడ వెస్ట్ లో జలీల్ ఖాన్ కు టికెట్ దక్కలేదు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ దక్కించుకున్నారు.

రెండో జాబితాల్లోనూ తమకు కచ్చితంగా టికెట్ దక్కుతుందని సీనియర్లు భావించారు. అయితే, వారికి సెకండ్ లిస్టులోనూ నిరాశే ఎదురైంది. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులకు సెకండ్ లిస్టులోనూ చోటు దక్కలేదు. కనీసం మూడో జాబితాలో అయినా తమకు టికెట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా, సర్వేలు, ప్రజాభిప్రాయసేకరణ, పార్టీ పరంగా అంతర్గతంగా జరిగిన అనేక సర్వేల ఆధారంగానే రెండు జాబితాల్లోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగించింది టీడీపీ.

రెండు జాబితాల్లోనూ టికెట్ దక్కక తీవ్ర నిరాశలో ఉన్న వ్యక్తుల్లో గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహర్ ప్రధానంగా ఉన్నారు. వీరంతా పార్టీలో సీనియర్ నాయకులు, పైగా మంత్రులుగా పని చేసిన వారు. తప్పకుండా మొదటి జాబితాలోనే తమకు టికెట్ లభిస్తుందని ఆశించిన వ్యక్తులు. అయితే, 34 మందితో విడుదలైన రెండో జాబితాలోనూ తమ పేర్లు లేకపోవడంతో సీనియర్లు కంగారు పడుతున్నారు. అసలు వారికి టికెట్ దక్కుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.

Also Read : 34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్ట్ విడుదల