Cm Revanth Reddy: కేసీఆర్ నీ గుండెలపై రాసి పెట్టుకో.. 2034 వరకు నేనే సీఎం- రేవంత్ రెడ్డి
కేసీఆర్ దుఃఖానికి కారణం రైతుల సంతోషమే తప్ప ఇంకోటి కాదు.

Cm Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ రాసి పెట్టుకో.. పదేళ్లు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు గడ్డ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని మీకు దుఃఖం వస్తుందా? అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. బలహీన వర్గాల పిల్లలు చదువుకునేందుకు 25 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నందుకు దుఃఖం వస్తుందా? అంటూ నిలదీశారు. పాలమూరు బిడ్డ 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కంకణం కట్టుకుని పని చేస్తున్నందుకా దుఃఖం? అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. అత్యంత వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన చెప్పారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్ల వ్యయంతో ఈ విద్యా సంస్థను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా “ప్రజా పాలన- ప్రగతి బాట” సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
”కేసీఆర్ నీ గుండెలపై రాసి పెట్టుకో. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబును కోరుతున్నా. మీరు బాధ్యతగా ఉండండి.. మమ్మల్ని బతకనివ్వండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారంగా వ్యవహరించండి. మీరు సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తాం. మా విజ్ఞప్తులను వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసు. అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా పాలమూరును అభివృద్ధి చేసితీరుతాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పాలమూరు జిల్లా అంటే కేసీఆర్ కు చిన్నచూపు అని సీఎం రేవంత్ అన్నారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా కేసీఆర్ ను పార్లమెంట్ కు పంపింది పాలమూరు జిల్లా అని చెప్పారు. గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు కేసీఆర్ ఇచ్చింది ఏంటో నిరంజన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. 98 జీవో ప్రకారం పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నిర్వాసితులను ఎందుకు ఆదుకోలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాల్మీకి సోదరులను ఎస్టీ బోయలుగా మారుస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. పదేళ్లలో ఈ సమస్యలను పరిష్కరించి ఉంటే పాలమూరు వాసులు మళ్లీ సమస్యపై కొట్లాడే పరిస్థితి ఉండేదా? అని ఆయన అడిగారు.
”ప్రజాపాలన చూసి కేసీఆర్ కు దుఃఖం వస్తుందట. 40 ఏళ్లుగా మాదిగ బిడ్డలు వర్గీకరణ కోసం పోరాడుతుంటే.. మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకా నీకు దుఃఖం? నీ కొడుకు, నీ మనవడిలాగే మాదిగ బిడ్డలు చదువుకుంటున్నందుకా నీకు కళ్లల్లో నీళ్లు వచ్చాయ్? పదేళ్లు సీఎంగా ఉండి పాలమూరు ప్రాజెక్టులను పడావు పెట్టారు. పాలమూరు రంగారెడ్డిని పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు?
కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది. పదేళ్లు పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్తున్నాం. కడుపులో ఎందుకు అంత విషం పెట్టుకుని మాపై చిమ్ముతున్నావ్? జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అభినందించాల్సింది పోయి… శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి సద్దులు మోస్తున్నారు. ఎవరికీ ఏదీ జరగలేదని మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు. కానీ రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్. తెచ్చింది కాంగ్రెస్.. కొనసాగిస్తున్నది కాంగ్రెస్. వరికి బోనస్ ఇచ్చి ప్రతీ గింజ కొంటున్నాం. మొదటి ఏడాదిలోనే రూ.21 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మాది. 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతులకు రైతు భరోసా ఇచ్చింది మేం కాదా? రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రజల్లోకి వెళ్లి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే కడుపు మంటతో వాళ్లకు దుఃఖం వస్తుంది. కేసీఆర్ దుఃఖానికి కారణం రైతుల సంతోషమే తప్ప ఇంకోటి కాదు.
ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు అనే ఆలోచన కేసీఆర్ ది. ఆడబిడ్డలను ప్రోత్సహించి కోటీశ్వరులను చేయాలన్న ప్రయత్నం మాది. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి రుణాలు అందిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యత అప్పగించాం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఆడబిడ్డలను వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నది నిజం కాదా? సోలార్ ప్లాంట్ ఏర్పాటు, పెట్రోల్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రోత్సహించి అంబానీ అదానీతో పోటీ పడేలా ఆడబిడ్డలకు అప్పగించాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఈ 18 నెలల్లో 6500 కోట్లు ఖర్చు చేశాం. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశాం.
మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం. రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత మాది. ఏడాదిన్నరలోగా ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తి చేస్తాం. మళ్లీ ఇక్కడికి వచ్చి స్కూల్ ను ప్రారంభిస్తా” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రూ.344 కోట్లతో తెలంగాణలోని 3,52,635 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 2,671 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.6 కోట్ల 33 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 570 స్వయం సహాయక సంఘాలకు రూ. 41 కోట్ల 61 లక్షల బ్యాంకు రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యురాలికి రూ.20 లక్షలు ప్రమాద బీమా చెక్కును, స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యురాలికి రూ.9 లక్షల 35 వేల 443 లోన్ బీమా చెల్లింపు చెక్ ను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి.