Smita Sabharwal : స్మితా సబర్వాల్ ఔట్, ఆమ్రపాలి ఇన్..! తెలంగాణ సీఎంవోలో కీలక మార్పులు..!

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు అప్పటి సీఎం కేసీఆర్. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు.

Smita Sabharwal : స్మితా సబర్వాల్ ఔట్, ఆమ్రపాలి ఇన్..! తెలంగాణ సీఎంవోలో కీలక మార్పులు..!

Smita Sabharwal And Amrapali Kata

ప్రభుత్వం మారితే పథకాల పేర్లు, పరిస్థితులే కాదు అధికారులు కూడా ఛేంజ్ అయిపోతారు. సీఎం ఆఫీసులో అధికారుల టీమ్ అంతా మారిపోవడం కామన్. అయితే, స్మితా సబర్వాల్, ఆమ్రపాలి.. మహిళా ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు సీఎం ఆఫీసుకు గుడ్ బై చెప్పాలనుకుంటే మరొకరు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మొన్నటివరకు కేసీఆర్ టీమ్ లో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్లుగా టాక్. ఇటు కేంద్ర సర్వీసులో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి రేవంత్ రెడ్డి టీమ్ లో జాయిన్ కానున్నారు అనే చర్చ జరుగుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి కొత్త టీమ్ మెల్లమెల్లగా ఫార్మ్ అవుతోంది. సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపికపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఆమ్రపాలి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు అప్పటి సీఎం కేసీఆర్.

సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, హ్యాండ్ లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేసేవారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు.

అయితే కొత్త సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించడం లేదు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమైన అధికారులు అంతా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. కానీ, స్మితా సబర్వాల్ మాత్రం ఇంతవరకు సీఎం రేవంత్ ను కలవలేదు. తన భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. తాను కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.

స్మితా సబర్వాల్ స్థానంలో తెలంగాణ సీఎం ఆఫీసులోకి ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి ఎంట్రీ ఇస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కేంద్ర సర్వీస్ ముగించుకుని తెలంగాణకు వచ్చిన ఆమ్రపాలి సీఎం రేవంత్ ను కలిశారు. శుభాకాంక్షలు సైతం తెలిపారు. దీంతో ఆమెకు సీఎం కార్యాలయంలో కీలక బాధ్యతలు కన్ ఫర్మ్ అంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

Also Read : 3 రాష్ట్రాల సీఎంలుగా గిరిజన, యాదవ, బ్రాహ్మణ.. 2024 ఎన్నికల ఎజెండాను ఫిక్స్ చేసిన బీజేపీ?

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లో 2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారిణిగా ఆమ్రపాలి విధుల్లో చేరారు. తెలంగాణలో పలు జిల్లాలలో కలెక్టర్ గా పని చేశారు. 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా మొదట విధుల్లో చేరిన ఆమ్రపాలి ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలకు కలెక్టర్ గా పని చేసి డైనమిక్ అధికారిణిగా పేరు గడించారు. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్ గా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో జాయింట్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.

Also Read : తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్ రెడ్డి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వద్ద ప్రైవేట్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆమ్రపాలని ప్రధాని కార్యాలయం డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. అతి చిన్న వయసులోనే ఈ పదవిలో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు. పీఎంవో కార్యాలయంలో ఆమె 2023 అక్టోబర్ 23 వరకు సుమారుగా మూడేళ్ల పాటు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. ఇప్పుడు కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యి మళ్లీ తెలంగాణకు వచ్చారు.

స్మితా సబర్వాల్, ఆమ్రపాలి మధ్య వృత్తిపరంగా, ఉద్యగ పరంగా చాలా పోలికలు కనిపిస్తాయి. ఇద్దరూ చిన్న వయసులోనే సివిల్స్ ర్యాంకు సాధించారు. స్మితా సబర్వాల్ 4వ ర్యాంకు సాధిస్తే ఆమ్రపాలి 39వ ర్యాంకు సాధించి ఐఏఎస్ గా ఎంపికయ్యారు. బాధ్యతల విషయంలోనూ ఇద్దరూ చాలా స్ట్రిక్ట్ అనే పేరుంది. దీంతో తెలంగాణ సీఎంవో కార్యాలయం నుండి స్మితా సబర్వాల్ వెళ్లిపోతుండగా ఆమె స్థానంలో మరో ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి ఎంట్రీ ఇస్తుండటం ఇటు రాజకీయవర్గాల్లో అటు బ్యారోక్రాట్స్ లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.