ఎన్నికల వేళ.. ఇండియా కూటమికి బిగ్‌ రిలీఫ్

మధ్య ప్రదేశ్‌లో 29 లోక్‌సభ స్థానాలుండగా.. కేవలం ఖజురహో స్థానంలో మాత్రమే సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయనుంది. మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తామని ఎస్పీ ప్రకటించింది.

ఎన్నికల వేళ.. ఇండియా కూటమికి బిగ్‌ రిలీఫ్

India Bloc

INDIA Alliance : ఇన్నాళ్లూ ఒక్కొక్కటిగా దూరమవుతున్న పార్టీలతో ఇబ్బందులు పడ్డ ఇండియా కూటమికి బిగ్‌ రిలీఫ్ లభించింది. అలయెన్స్‌లోని పలు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుపై క్లారిటీకి వచ్చిన నేతలు.. సీట్ల పంపకాలు కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో సీట్ల పంపకాలను నేతలు ధ్రువీకరించగా.. ఢిల్లీ సహా 7 రాష్ట్రాల విషయంలో మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇండియా కూటమిలో పొత్తులు పొడుస్తున్నాయి. సీట్లపై ఒక్కో పార్టీతో క్లారిటీ రావడంతో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలపై క్లారిటీ రాగా.. మరో 7 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ చర్చలు సాగుతున్నాయి. త్వరలోనే ఈ రాష్ట్రాల్లో సీట్ల కేటాయింపు పూర్తవుతుందని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

ఇన్నాళ్లూ పొత్తులపై గుంభనంగా మాట్లాడిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌.. పోటీపై క్లారిటీ ఇచ్చారు. ఇండియా కూటమిలోనే ఉంటామని.. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు.. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పోటీ చేసే లోక్‌సభ స్థానాలపై ఇరు పార్టీల మధ్య అవగాహన సైతం కుదిరింది. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 17 సీట్లలో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని, 62 స్థానాల్లో ఎస్పీ, ఒకచోట ఆజాద్‌ సమాజ్‌వాదీ పార్టీ పోటీలో ఉంటుందని ప్రకటించారు.

ఇక మధ్య ప్రదేశ్‌లో 29 లోక్‌సభ స్థానాలుండగా.. కేవలం ఖజురహో స్థానంలో మాత్రమే సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయనుంది. మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తామని ఎస్పీ ప్రకటించింది. ఈ రాష్ట్రంలో 19 సీట్లు కావాలని కాంగ్రెస్‌ పట్టుబట్టగా.. 11 సీట్లు ఇస్తామని ఎస్పీ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ రంగంలోకి దిగి పొత్తుల సమస్యను పరిష్కరించారు.

పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 4 : 3 ఫార్ములాకు ఫిక్స్‌ అయిన ఆప్‌.. నాలుగు స్థానాల్లో తాము పోటీ చేసి, మిగతా 3 స్థానాలు కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు రెడీగా ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే.. పొత్తుల చర్చలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని ప్రకటించిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. రెండు మూడు రోజుల్లో పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు.

మరోవైపు హర్యానా, అసోం, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీతో సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌ చర్చలు జరుపుతోంది. హర్యానా, గోవా, అసోం, గుజరాత్‌లో ఆప్‌కు ఒక్కో సీటు ఇచ్చేందుకు అంగీకరించిన కాంగ్రెస్‌.. అందుకు బదులుగా ఢిల్లీలో మూడు సీట్లు కోరుతోంది. ఇక మహారాష్ట్ర, తమిళనాడులోనూ సీట్ల పంపకాలపై చర్చలు చివరి దశలో ఉన్నాయని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ వర్గాలు ప్రకటించాయి.
ఎండ్‌ వాయిస్‌

మొత్తంగా ఇన్నాళ్లూ సీట్ల కేటాయింపులో ఆలస్యం వల్ల దూరమైన పార్టీలు.. ఒక్కొక్కటిగా కలిసి రావడం ఇండియా కూటమికి ఊరటనిచ్చే అంశమనే చెప్పొచ్చు.