ఇండియా జాయ్ : ప్రపంచ సినిమాకు హైదరాబాద్ వేదిక – మంత్రి కేటీఆర్

చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ చక్కని వేదికగా మారిందని, అనేక భారీ సినిమాలకు హైదరాబాద్లోనే వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది కల్లా ప్రపంచ యానిమేషన్ రంగం 2780 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. 2019, నవంబర్ 20వ తేదీ బుధవారం హెచ్ఐసీసీలో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ఫెస్టివల్ ఇండియా జాయ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…హైదరాబాద్లో గేమింగ్, ఎంటర్ టైన్ మెంట్ మరింత పెరుగుతుందన్నారు. యానిమినేషన్తో పాటు గేమింగ్ ఇండస్ట్రీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం గేమింగ్ ఇండస్ట్రీ మార్కెట్ విలువ రూ. 140 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపారు. ప్రపంచస్థాయి సినిమా స్టూడియోలు హైదరాబాద్లో ఉన్నాయని, వీఎఫ్ఎక్స్ గేమింగ్ యానిమినేషన్ రగంలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోందన్నారు. వెయ్యి కోట్ల ఖర్చుతో హైదరాబాద్లో ఇమేజ్ టవర్ నిర్మించబోతున్నట్లు, 2021 చివరికల్లా ఇమేజ్ టవర్ అందుబాటులోకి వస్తుందన్నారు.
టాస్క్ ద్వారా ఈ రంగాల్లో ఔత్సాహికులకు శిక్షణిస్తామన్న మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎంటర్టైన్ మెంట్ రంగంలో వ్యాపార విస్తరణ, నూతన ఆలోచనలు, ఉపాధి, పెట్టుబడులకు ఆహ్వానం, ఆలోచనల బదిలీకి ఇండియా జాయ్ – 2019 వారధిగా నిలువనుంది. తెలంగాణ వీఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) ఈ ఎక్స్ పోను నిర్వహించింది. నాలుగు రోజుల పాటు ఈవెంట్ జరుగనుంది.
Read More : సెల్ ఫోన్ మాట్లాడుతూ..బస్సును నడిపిన తాత్కాలిక డ్రైవర్