బీజేపీ-శివసేన బంధాన్ని విడగొట్టేందుకే అప్పుడలా చేశా

  • Published By: venkaiahnaidu ,Published On : July 13, 2020 / 06:22 PM IST
బీజేపీ-శివసేన బంధాన్ని విడగొట్టేందుకే అప్పుడలా చేశా

Updated On : July 13, 2020 / 6:33 PM IST

2014లో మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించటంపై స్పష్టతనిచ్చారు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​. అప్పటి ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలపై కీలక విషయాలను సామ్నా పత్రికతో పంచుకున్నారు పవార్​.

2014లో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం భాజపాకు ఎన్సీపీ బయట నుంచి మద్దతు ఇస్తుందని ప్రకటించడం… ఎన్​డీఏ నుంచి శివసేనను దూరం చేసేందుకు వేసిన రాజకీయ ఎత్తుగడ అని పవార్ చెప్పారు. భాజపా, శివసేన మధ్య దూరాన్ని పెంచేందుకు తాను ప్రయత్నించినట్లు అంగీకరించారు.

పవార్ మాట్లాడుతూ.. 2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం శివసేన-భాజపా కూటమి అధికారంలోకి రాకూడదనే ఆ ప్రకటన చేశాను. ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వస్తుందని గ్రహించి.. భాజపా ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తానని ప్రకటించాను. కానీ, ఆ మంత్రం పనిచేయలేదు. శివసేన ప్రభుత్వంతో కలిసింది. కూటమి పూర్తి పదవి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 2014లో కేంద్రంలో భాజపా అధికారంలో ఉంది. మహారాష్ట్రలోనూ అధికారంలో ఉంటే శివసేనకు నష్టం జరుగుతుందని తెలుసు. భాజపాకు బయట నుంచి మద్దతు ప్రకటన కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగమే. భాజపా, శివసేన మధ్య దూరం పెంచేందుకు నేను ఆ పని చేసినట్లు అంగీకరిస్తున్నా అని పవార్ అన్నారు.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని భాజపా నాయకులు తనను కలిసినట్లు చెప్పారు పవార్​. కానీ, ఎన్సీపీ భాజపాతో ఎప్పటికీ కలవబోదని, అవకాశం ఉంటే శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేస్తాం లేదంటే ప్రతిపక్షంలో కూర్చుంటామని మోడీకి తేల్చి చెప్పినట్లు గుర్తు చేశారు పవార్​. ప్రజాస్వామ్యంలో బీజేపీయేతర పార్టీలు పని చేసే హక్కు ఉందని బీజేపీ నమ్మటం లేదని పవార్ ఆరోపించారు.

 ఆపరేషన్​ కమల్​ పనిచేయదు

ఇతర రాష్ట్రాల తరహాలో ఆపరేషన్​ కమల్​ మహారాష్ట్రలో పని చేయదని పవార్ తెలిపారు. ఠాక్రే ప్రభుత్వం పూర్తి పదవి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తుందని నొక్కిచెప్పారు. మహా వికాస్​ అఘాడి ఆ తర్వాతి ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

ఫడ్నవిస్ ఆరోపణలపై

2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పవార్​ భాజపా నేతలతో మంతనాలు జరిపి మళ్లీ యూటర్న్​ తీసుకున్నారని దేవేంద్ర ఫడణవీస్ చేసిన​ వ్యాఖ్యలను పవార్ తోసిపుచ్చారు. అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఫడ్నవిస్ స్థానం ఎక్కడ? జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఆయనకు ప్రాధాన్యం ఉందని నేను నమ్మటం లేదు. ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు ఆయన ఎవరికీ తెలియదని పవార్ ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి అధికారం కోల్పోవటం జీర్ణించుకోలేకపోతున్నారని… అది ఆయనకు మంచిది కాదని వ్యాఖ్యానించారు పవార్.

2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు భాజపా నేతలు తనతో, తన సన్నిహితులతో సంప్రదింపులు జరిపారని పవార్ తెలిపారు. ప్రధానితో మంచి సంబంధాలు ఉన్నందున అనుమతి తెలపాలని కోరారని.. కానీ మోడీని కలిసి తమ వైఖరిపై స్పష్టత నిచ్చినట్లు చెప్పారు.