తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తాం – పవన్

తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకున్నట్లు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని… ఇప్పుడు పార్టీని తెలంగాణలో బలోపేతం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించుకుందామని, అర్హులైన పేర్లను కార్యకర్తలే సూచించాలన్నారు.
కమిటీల ఏర్పాటు కూడా కార్యకర్తల అభీష్టం మేరకు జరుగుతుందన్నారు. ఇక నుంచి ప్రతినెలా కొన్ని రోజులపాటు తెలంగాణలో పార్టీ కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు పవన్ హామీ ఇచ్చారు.
మరోవైపు బీజేపీతో జనసేన చేతులు కలపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. పొత్తుపై చాలా లోతుగా ఆలోచించాకే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు… అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నామని చెప్పారు. బీజేపీ అగ్ర నాయకత్వంతో గతంలో పలుమార్లు చర్చలు జరిగాయని పవన్ తెలిపారు.
పొత్తు విషయంలో ఇరు పక్షాల నుంచి ఎలాంటి షరతులూ లేవని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీతో కలసి పని చేసినట్లు పవన్ గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలని.. లేని పక్షంలో అపోహలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు పవన్ కల్యాణ్.
Read More : Breaking : రాజధాని గ్రామంలో మరో రైతు మృతి