TTD : తిరుమల వైకుంఠద్వార దర్శనం.. భక్తులు చలికి ఇబ్బంది పడకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

tirumala vaikunta dwaram darsanam
tirumala vaikunta dwaram darsanam : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా డిసెంబరు 23 నుంచి భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనం కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ద్వార దర్వనం డిసెంబర్ 23 నుంచి జనవరి 1వరకు అంటే 10 రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. శీతాకాలం..పైగా తిరుమల గిరులపై మరింత చలి ఉంటుంది..దీంతో భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులు ఎక్కువ సమయం లైన్లలో ఉండకుండా టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ టోకెన్లు ఉన్నభక్తుల్నే దర్శనాలకు అనుమతిస్తామని స్పష్టంచేశారు.
ఇప్పటికే రోజుకు 2000 టికెట్లు చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేశామని.. ఆఫ్లైన్లో స్లాట్ సర్వదర్శనం తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా డిసెంబరు 22 నుండి మొత్తం 4,23,500 టోకెన్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.
కాగా.. ఈ టోకెన్ల కేంద్రాలు..తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ స్కూల్, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకెన్ కౌంటర్లు ఏర్పాటుచేయనున్నారు.