Jasprit Bumrah : ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా వంద శాతం ఫిట్నెస్ సాధిస్తే అద్భుతమేనా?
వెన్నుగాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

Bumrah Champions Trophy participation depends on Kiwi doctor report
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్నప్పటికి టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను సైతం జట్టులోకి తీసుకుంది. అయితే.. అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే ఆడుతాడని లేదంటే ఆడడని ఇప్పటికే సెలక్టర్లు వెల్లడించారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి బుమ్రా వంద శాతం ఫిట్నెస్ సాధిస్తే అది అద్భుతమే అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఆంగ్ల మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బీసీసీఐ వైద్య బృందం న్యూజిలాండ్కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ రోవాన్ షౌటెన్ తో సంప్రదింపులు జరుపుతోందట. ఈ క్రమంలో బుమ్రాను న్యూజిలాండ్కు పంపించే ప్లాన్ చేస్తున్నట్లుగా పేర్కొన్నాయి. కివీస్ డాక్టర్ ఇచ్చే నివేదిక తరువాతనే బుమ్రాను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించాలా వద్దా అనే నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అప్పుడు శస్త్రచికిత్స చేసింది ఆ డాక్టరే..
అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా తక్కువ సమయం ఉంది. ఇంత తక్కువ సమయంలో బుమ్రా వంద శాతం ఫిట్నెస్ సాధిస్తే అద్భుతమే అని సెలక్టర్లకూ తెలుసంటూ బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లుగా సదరు కథనాలు పేర్కొన్నాయి. కాగా.. 2022లో టీ20 ప్రపంచకప్కు గాయంతో బుమ్రా దూరమైన సమయంలో అతడికి శస్త్రచికిత్స చేసింది రోవాన్ షౌటెన్ కావడం గమనార్హం.
ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని ఐదో టెస్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో బుమ్రా వెన్నుగాయం బారిన పడ్డాడు. దీంతో అతడు మైదానం వీడి ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి పరీక్షలు నిర్వహించారు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ మాత్రమే చేసిన బుమ్రా బౌలింగ్ చేయలేదు. బుమ్రా బౌలింగ్ చేయకపోవడం భారత్ను గట్టిగానే దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఓడిపోయింది. ఫలితంగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ను 3-1తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.
Virat Kohli : బంగర్ త్రో వేస్తుంటే కోహ్లీ బ్యాటింగ్.. రన్ మెషిన్ కి ఎంత కష్టం వచ్చింది..
ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇప్పటికే భారత జట్టును ప్రకటించినప్పటికి మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. ఆలోపు బుమ్రా ఫిట్నెస్ పై బీసీసీఐ ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకుంటే మాత్రం అది టీమ్ఇండియా విజయావకాశాలపై ప్రభావం చూపించడం ఖాయం.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో..
ఫిబ్రవరి 23న పాకిస్థాన్తో..
మార్చి 2న న్యూజిలాండ్తో..
హైబ్రిడ్ మోడ్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. భారత్ ఆడే మ్యాచులు అన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి.