MS Dhoni : చెన్నైలో ధోనికి గుడి కడతారు.. అంబటి రాయుడు వ్యాఖ్యలు వైరల్
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు
![MS Dhoni : చెన్నైలో ధోనికి గుడి కడతారు.. అంబటి రాయుడు వ్యాఖ్యలు వైరల్ MS Dhoni : చెన్నైలో ధోనికి గుడి కడతారు.. అంబటి రాయుడు వ్యాఖ్యలు వైరల్](https://10tv.in/wp-content/uploads/2024/05/Chennai-fans-may-build-temples-to-honor-MS-Dhoni-says-Ambati-Rayudu.jpg)
PIC Credit : CSK
MS Dhoni-CSK : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా చెన్నైలో రానున్న రోజుల్లో ధోనికి దేవాలయాలు నిర్మిస్తారని టీమ్ఇండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. మహేంద్రుడి ఫాన్ ఫాలోయింగ్ గురించి చెబుతూ రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు వచ్చాయి. మ్యాచ్ ముగిసిన తరువాత అభిమానులు మైదానంలో ఉండాలని సోషల్ మీడియా వేదికగా సీఎస్కే ఫ్రాంచైజీ పోస్ట్ చేయడంతోనే ఈ ఊహాగానాలు మొదలు అయ్యాయి. అయితే.. మ్యాచ్ ముగిసిన తరువాత అభిమానుల కంగారు నిజం కాలేదు. ధోని రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
IPL 2024 : ప్లేఆఫ్స్కు ముందు అయోమయంలో ఆర్సీబీ, రాజస్థాన్.. ఇప్పుడెలా?
ఈ సీజన్లో చెన్నై హోం గ్రౌండ్ అయిన చెపాక్ మైదానంలో సీఎస్కే ఆఖరి మ్యాచ్ కావడంతో ఎప్పటిలాగానే.. ధోని ‘ల్యాప్ ఆఫ్ హానర్’ను నిర్వహించారు. జట్టు సభ్యులతో తాను సంతకాలు చేసిన బంతులను టెన్నిస్ రాకెట్తో కొట్టి అభిమానులకు అందించాడు. ఈ సందర్భంలో స్టార్ స్పోర్ట్స్లో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ధోని కి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పుకొచ్చాడు. చెన్నైకి ధోని దేవుడి అని అన్నాడు.
మరి కొన్నాళ్లలో చెన్నైలో ధోనికి ఆలయాలు ఖచ్చితంగా నిర్మిస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. భారత దేశానికి రెండు ప్రపంచకప్లు అందించిన వ్యక్తి ధోని అని, అంతేకాకుండా చెన్నైకి ఐదు ఐపీఎల్ ట్రోఫీలు, 2 ఛాంపియన్ లీగ్ టైటిళ్లను అందించి వారి ఆనందాన్ని అందించాడన్నారు. ఆటగాళ్ల పై ఎంతో నమ్మకం ఉంచేవాడని, ఎల్లప్పుడూ దేశం, సీఎస్కే కోసం ఆడతాడని రాయుడు చెప్పాడు.
ఇదిలా ఉంటే.. ఆదివారం రాజస్థాన్ పై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది. మొత్తంగా ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడగా ఏడు మ్యాచుల్లో గెలిచింది. ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో తన ఆఖరి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా మే 18 శనివారం ఈ మ్యాచ్ జరగనుంది.
కాగా.. ఈ సీజన్కు ముందు ధోని సీఎస్కే కెప్టెన్సీకి గుడ్బై చెప్పగా రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.