Visakha : విశాఖలో భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. 15 నుంచి ఆన్లైన్లో టికెట్లు
Visakha Stadium : వన్డే ప్రపంచకప్ అనంతరం భారత జట్టు ఆసీస్తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది.
![Visakha : విశాఖలో భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. 15 నుంచి ఆన్లైన్లో టికెట్లు Visakha : విశాఖలో భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. 15 నుంచి ఆన్లైన్లో టికెట్లు](https://10tv.in/wp-content/uploads/2023/11/New-Project-19-2.jpg)
Visakha Stadium
వన్డే ప్రపంచకప్ అనంతరం భారత జట్టు ఆసీస్తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లోని మొదటి మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఏసీఏ కార్యదర్శి శ్రీ ఎస్ఆర్ గోపినాథ్రెడ్డి తెలిపారు. ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను ఈ నెల 15,16 తేదీల్లో ఆన్లైన్లో విక్రయించనున్నట్లు వెల్లడించారు. పేటీఎం (insider.in) లింక్ ద్వారా ఆన్లైన్లో టికెట్లను కొనుగోలు చేయొచ్చునని, 15వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు.
ఆఫ్లైన్లలో కూడా టికెట్ల విక్రయించనున్నట్లు తెలిపారు. పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం, వన్టౌన్ ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆఫ్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. టికెట్ ధరలు.. రూ.600, రూ.1,500, రూ.2000, రూ.3,000, రూ.3,500, రూ.6000 గా ఉంటాయన్నారు.
ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు..
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు ఏసీఏ ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైజాగ్ ఆర్కే బీచ్ వద్ద కాళీ మాత టెంపుల్ ఎదురుగా, విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో, వైఎస్సార్ కడపలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లలో స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో చోట దాదాపు 10 వేల మంది వీక్షించేలా సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. సెమీ ఫైనల్ మ్యాచ్ ను ఉచితం చూడొచ్చునని ఎలాంటి టికెట్ అవసరం లేదన్నారు.