Shubman Gill : ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది.. అసలు విషయం చెప్పేసిన శుభ్మన్ గిల్
Shubman Gill : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం రాత్రి రాజ్కోట్లో రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. అనంతరం కెప్టెన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
Shubman Gill
Shubman Gill : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం రాత్రి రాజ్కోట్లో రెండో వన్డే జరిగింది. ఈ వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 284 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ (53 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్తో 56) రాణించగా.. కేఎల్ రాహుల్ ( 92 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్తో 112 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. కోహ్లీ, రోహిత్ సహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు రాబట్టలేక పోయారు. లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు బ్యాటర్లు 47.3 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 286 పురుగులు చేశారు. విల్ యంగ్ (87) రాణించగా.. మిచెల్ (131 నాటౌట్) సెంచరీతో న్యూజిలాండ్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే, మ్యాచ్ ఓటమి అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక కామెంట్స్ చేశారు.
మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. మేము మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం మా ఓటమికి ప్రధాన కారణం. సర్కిల్లో ఐదుగురు ఫీల్డర్లు ఉన్నప్పుడు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకపోతే మ్యాచ్ గెలవడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ మేము 15-20 పరుగులు అదనంగా చేసినా ఓడిపోయేవాళ్లం. బౌలింగ్లో మాకు మంచి ఆరంభమే లభించింది. కానీ, న్యూజిలాండ్ బ్యాటర్లు మిడిల్ ఓవర్లలో చాలా బాగా బ్యాటింగ్ చేశారు. వారిని మేము ఒత్తిడిలోకి నెట్టలేకపోయాం.
మేము బౌలింగ్ చేసిన మొదటి 10 నుంచి 15 ఓవర్ల వరకు బంతి బాగానే స్పందించింది.. ఆ తరువాత వికెట్ సెట్ అయ్యింది. కానీ, మేము మరింత మెరుగ్గా ఆడి మరిన్ని అవకాశాలను సృష్టించాల్సింది. గత మ్యాచ్లో మేము కొన్ని క్యాచ్లను నేలపాలు చేశాం. కానీ, ఈ మ్యాచ్లో మెరుగ్గానే రాణించాం. ఫీల్డింగ్ విభాగంలో ఎల్లప్పుడూ మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. అవకాశాలను అందుకోకపోతే మ్యాచ్లను గెలవలేం అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు.. మ్యాచ్ విజయం అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రెస్వెల్ మాట్లాడుతూ.. తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇది మా జట్టు కనబర్చిన సమిష్ఠి ప్రదర్శన. ఇన్నింగ్స్ విరామ సమయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే.. భారత్ ను ఎక్కువ స్కోర్ చేయకుండా కట్టడి చేశాం. ఆ సమయంలోనే మ్యాచ్ సగం గెలిచామని భావించాం. భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. కానీ మా బ్యాటర్లు పరిస్థితులకు అనుగుణంగా ఆడారు. ముఖ్యంగా ఒత్తిడిని ఎదుర్కొన్న తీరు అద్భుతం. ఆ తర్వాత డారిల్, యంగ్ మ్యాచ్ను భారత్ నుంచి లాక్కున్నారని మైఖేల్ బ్రెస్వెల్ చెప్పారు.
