CSKVsKKR Target 132 : చెలరేగిన కోల్కతా బౌలర్లు, ధోని ధనాధన్ బ్యాటింగ్, కేకేఆర్ టార్గెట్ 132
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.(CSKVsKKR Target 132)
CSKVsKKR Target 132 : ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 లీగ్ 15వ సీజన్ తొలి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కోల్ కతా ముందు 132 పరుగుల మోస్తరు టార్గెట్ ఉంచింది. ఈ మ్యాచ్ లో కోల్ కతా బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ప్రత్యర్థిని కట్టడి చేశారు. మ్యాచ్ ఆరంభంలోనే చెన్నై జట్టు కీలక వికెట్లు కోల్పోయింది.
10.5 ఓవర్లలో 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కాగా, సీఎస్కే మాజీ కెప్టెన్ ధోని ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో జట్టుని ఆదుకున్నాడు. ధోని 38 బంతుల్లోనే 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ధోని ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. చెన్నై జట్టు ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే కారణం ధోనినే. ఇక రాబిన్ ఉతప్ప(28), కెప్టెన్ రవీంద్ర జడేజా(26*) రాణించారు. కోల్ కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ తీశారు.(CSKVsKKR Target 132)
టీ20 మెగా టోర్నీ 15వ సీజన్ మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై, కోల్కతా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నైకి బ్యాటింగ్ అప్పగించాడు. గత సీజన్ ఫైనల్ పోరులో కోల్కతాపై ఆధిపత్యం చెలాయించిన చెన్నై.. టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
IPL-2022 Matches : నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం.. ఈసారి అన్ని మ్యాచ్లు భారత్లోనే
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే కోల్కతా బౌలర్లు వరుస షాకులు ఇచ్చారు. ఉమేశ్ యాదవ్ వేసిన తొలి ఓవర్లో మూడో బంతికి చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) స్లిప్లో దొరికిపోయాడు. ఐదో ఓవర్లో మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (3)ని కూడా ఉమేశ్ పెవిలియన్ చేర్చాడు. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయినా.. రాబిన్ ఉతప్ప (28) ధాటిగా ఆడాడు. శివమ్ మావి వేసిన రెండో ఓవర్లో నాలుగో బంతిని బౌండరీకి తరలించిన అతడు.. ఉమేశ్ వేసిన తర్వాతి ఓవర్లో ఓ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి ఓవర్లో ఓ సిక్స్, ఓ ఫోర్ సహా 12 పరుగులు రాబట్టాడు. దూకుడుగా ఆడుతున్న క్రమంలో వరుణ్ చక్రవర్తి వేసిన 8వ ఓవర్లో స్టంపౌటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లలోనే అంబటి రాయుడు (15) రనౌటయ్యాడు. శివమ్ దూబె (3) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు.
దీంతో 15 ఓవర్లకు చెన్నై 73/5 స్కోర్ తో నిలిచింది. ఆ తర్వాత కెప్టెన్ రవీంద్ర జడేజా (26), ధోని (50) సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్ని చక్కదిద్దారు. 18వ ఓవర్లో ధోని మూడు ఫోర్లు బాదాడు. 19వ ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్స్ బాదాడు. ఆఖరి ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదిన ధోని.. ఐదో బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతిని రవీంద్ర జడేజా సిక్స్గా మలిచాడు. దీంతో చెన్నై 131/5 స్కోరుతో నిలిచింది.