IPL 2025: ఐపీఎల్‌లో బౌలర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక రెచ్చిపోండంతే..

బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు జాతీయ మీడియాకు వివరాలు తెలిపారు.

IPL 2025: ఐపీఎల్‌లో బౌలర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక రెచ్చిపోండంతే..

Updated On : March 20, 2025 / 3:44 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో బౌలర్లు బంతికి సలైవా (లాలాజలం) రుద్దడంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఇవాళ ఎత్తివేసింది. సలైవా వాడడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలన్న ప్రతిపాదనకు ఐపీఎల్‌ జట్లలోని అధిక శాతం మంది కెప్టెన్లు అంగీకరించడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

IPL 2025: అయ్య బాబోయ్‌.. హార్దిక్ పాండ్యాపై బయోపిక్‌ తీస్తే..: కైఫ్ ఆసక్తికర కామెంట్స్‌

“సలైవా వాడకంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. మెజారిటీ కెప్టెన్లు దీనికి సానుకూలంగా స్పందించారు” అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు.

కొవిడ్-19 మహమ్మారి సమయంలో కరోనా సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా బాల్‌పై సలైవాను పూయడాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధించింది. 2022లో ఈ నిషేధం శాశ్వతంగా ఉంటుందని తెలిపింది. ఐపీఎల్లో కూడా ఈ నిషేధాన్ని బీసీసీఐ చేర్చింది. కొవిడ్‌-19 వ్యాప్తి చెందకముందు ఉమ్మిని బంతిపై వాడే విధానం అమల్లోనే ఉంది.

బీసీసీఐ లాలాజలం వాడకంపై నిషేధాన్ని రద్దు చేయడమే కాకుండా “మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ కోసం రెండో బంతి” అనే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. ఐపీఎల్‌ 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ముంబైలోని క్రికెట్ సెంటర్‌లో గురువారం కెప్టెన్ల, మేనేజర్ల సమావేశం జరిగింది. ఇందులో బీసీసీఐ ఈ కొత్త నియమాలను గురించి వివరించింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత రెండో బాల్‌ను ఇస్తారు. రాత్రిపూట జరిగే ఈ మ్యాచ్‌పై పడే మంచు బిందువుల ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చారు.

అయితే, బంతి మార్పు విషయాన్ని బీసీసీఐ అంపైర్ల అభీష్టానికి వదిలివేసింది. బంతిని మార్చాలా వద్దా అనేది అంపైర్లు నిర్ణయించాల్సి ఉంటుంది. మంచు బిందువులు మైదానంలో పడే తీరు ఆధారంగా వారు నిర్ణయం తీసుకుంటారు. ఈ నియమం ప్రధానంగా రాత్రి సమయంలో మ్యాచులకు వర్తిస్తుంది. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లలో రెండవ బంతిని ఉపయోగించే అవకాశం లేదు.