IND vs NZ semi final : భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైన‌ల్‌.. టికెట్ ల‌క్షా20 వేలు.. వ్య‌క్తి అరెస్ట్‌..!

India vs New Zealand Semi final : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో సెమీస్‌కు దూసుకువెళ్లింది.

IND vs NZ semi final : భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైన‌ల్‌.. టికెట్ ల‌క్షా20 వేలు.. వ్య‌క్తి అరెస్ట్‌..!

IND vs NZ semi final

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో సెమీస్‌కు దూసుకువెళ్లింది. మూడో సారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. సెమీ ఫైన‌ల్ లో న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖ‌డే వేదికైంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా గెలిచి ఫైన‌ల్ కు చేర‌డంతో పాటు 2019 వ‌న్డే ప్ర‌పంచక‌ప్ సెమీ ఫైన‌ల్‌లో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని స‌గ‌టు భార‌త అభిమాని కోరుకుంటున్నాడు.

భార‌త్ సెమీ ఫైన‌ల్‌కు చేర‌డంతో వాంఖ‌డే మైదానంలో ప్ర‌త్యక్షంగా మ్యాచ్ చూడాల‌ని ప‌లువురు సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు అన్ని విక్ర‌యించారు. అయితే.. కొంద‌రు ఈ మ్యాచ్ టికెట్ల‌ను బ్లాక్‌లో విక్ర‌యిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో రోష‌న్ గురుబ‌క్ష అనే వ్య‌క్తిని సెమీ ఫైన‌ల్ మ్యాచ్ టికెట్ల‌ను బ్లాక్‌లో అమ్ముతున్నాడు అనే ఆరోప‌ణ‌ల‌పై ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

ఒక్కొ టికెట్ ల‌క్షా 20 వేలు..

అత‌డి నుంచి రెండు టికెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొ టికెట్ ను అత‌డు రూ.1,20,000 కు విక్ర‌యిస్తున్నాడ‌ని అంటున్నారు. గురుబ‌క్ష‌తో పాటు మ‌రో వ్య‌క్తి పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. బ్లాక్‌లో టికెట్ల విక్ర‌యిస్తున్న మ‌రో నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టిన‌ట్లు అధికారులు చెప్పారు.

ప్రపంచకప్ మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసేటప్పుడు క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ ముండే కోరారు. మ్యాచ్ మొద‌ల‌య్యే స‌మ‌యానికి కంటే గంట నుంచి రెండు గంట‌ల ముందుగానే స్టేడియానికి చేరుకోవాల‌ని ప్ర‌వీణ్ కోరారు.