CSK vs PBKS : ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ భారీ జరిమానా..
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ షాకిచ్చింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్లో ఐదు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. బుదవారం చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడంతో అధికారికంగా చెన్నై ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది. పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ పెద్ద షాక్ ఇచ్చింది. రూ.12లక్షల జరిమానా విధించింది.
ఈ మ్యాచ్లో సీఎస్కే తొలుత బ్యాటింగ్ చేసింది. 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. చెన్నై బ్యాటర్లలో సామ్ కర్రాన్ (47 బంతుల్లో 88 పరుగులు) హాఫ్ సెంచరీ చేయగా డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీయగా అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హర్ప్రీత్ బ్రార్, అజ్మతుల్లా తలా ఓ వికెట్ సాధించారు.
191 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 72 పరుగులు), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (36 బంతుల్లో 54 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో లక్ష్యాన్ని పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణా చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
కాగా.. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్లోఓవర్ రేటును నమోదు చేసింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోవడంతో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ ఫైన్ వేసింది. ఈ సీజన్లో పంజాబ్ ఈ నేరానికి పాల్పడడం ఇదే తొలిసారి కావడంతో కెప్టెన్ అయ్యర్కు రూ.12లక్షల జరిమానాను విధించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
చెన్నైపై విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. పంజాబ్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడింది. ఇందులో 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉండగా నెట్రన్రేట్ +0.199గా ఉంది. లీగ్ దశలో పంజాబ్ మరో నాలుగు మ్యాచ్లు ఆడనుంది. ఇందులో కనీసం రెండు మ్యాచ్లు గెలిచినా కూడా ఆ జట్టు ప్లేఆఫ్స్కు వెలుతుంది.