MSK Prasad స్థానంలో సునీల్ జోషీ
టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే పదవీ కాలం ముగియనుంది. అతనితో పాటు కమిటీలో ఉన్న మరో వ్యక్తి గగన్ ఖోడా స్థానాలను భర్తీ చేసేందుకు భారత జట్టు మాజీ క్రికెటర్లు సునీల్ జోషీ, హర్వీందర్ సింగ్లు పోటీపడుతున్నారు. బుధవారంతో అభ్యర్థులు ఎవరో తేలిపోనుంది.
కొత్త సెలక్షన్ కమిటీ సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఆడనున్న బృందాన్ని ఎంపిక చేయనుంది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) బుధవారం ముంబైలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ముగ్గురు సభ్యులు ఉన్న కమిటీలో భారత మాజీ ఆల్రౌండర్ మదన్లాల్ మంగళవారం బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీని, సెక్రటరీ జై షాను కలిశారు.
సీఏసీ ఇంటర్వ్యూలు నిర్వహించడం కోసం వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్, లక్ష్మణ్ శివరామకృష్ణన్లను ముందుగానే షార్ట్ లిస్ట్ చేశారు.
ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో సునీల్ జోషి:
భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సునీల్ జోషీ.. 15టెస్టులు ఆడారు. సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎమ్మెస్కే స్థానాన్ని భర్తీ చేయగలరని విశ్లేషకులు అంటున్నారు. ఆ కమిటీలో ఎమ్మెస్కే, గగన్ ఖోడాల పదవీ కాలం ఇప్పటికే ముగియగా జతిన్ పరంజపే, సారాన్దీప్ సింగ్, దేవాంగ్ గాంధీల పదవి మరి కొద్ది నెలలు మాత్రమే ఉండనుంది.