T20 World Cup Row : తమ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించడం పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ స్పందన..
ఐసీసీ తమ విజ్ఞప్తిని తిరస్కరించడం పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం (T20 World Cup Row) స్పందించాడు.
T20 World Cup Row Bangladesh Cricket Board Chief Reacts To ICC Rejecting
- ఐసీసీ తమ విజ్ఞప్తిని తిరస్కరించడంపై స్పందించిన బీసీబీ
- ప్రభుత్వంతో చర్చిస్తామన్న బీసీబీ ఛైర్మన్ అమీనుల్ ఇస్లాం
- ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్
T20 World Cup Row : టీ20 ప్రపంచకప్ 2026లో తమ జట్టు ఆడే మ్యాచ్లను భారతదేశం నుంచి శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించింది. షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని, భారత్లోనే బంగ్లాదేశ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ టోర్నీలో పాల్గొంటారా? లేదా ? అనే విషయం తెలియజేసేందుకు బుధవారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ 24 గంటల డెడ్లైన్ ఇచ్చింది.
కాగా.. ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం స్పందించాడు. ఏదైన అద్భుతం జరగబోదా అని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితి గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడటానికి మరింత సమయం కావాలని ఐసీసీ కోరినట్లుగా చెప్పుకొచ్చాడు.
Suryakumar Yadav : టీ20 క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత..
‘మా నిర్ణయాన్ని ఐసీసీ తిరస్కరించింది. దీంతో ప్రభుత్వంతో చర్చించాలని, అందుకు సమయం కావాలని ఐసీసీని కోరాను. అందుకు ఐసీసీ కూడా అంగీకరించింది. ప్రభుత్వంతో చర్చించి మా నిర్ణయం చెప్పేందుకు 24 లేదా 48 గంటలు సమయం ఇచ్చింది. నేను ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకుని రావాలని అనుకోవడం లేదు. ఎందుకంటే భారతదేశం మాకు సురక్షితం కాదని తెలుసు. శ్రీలంకలోనే ఆడాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఐసీసీ మా నిర్ణయాన్ని తిరస్కరించిందని నాకు తెలుసు కానీ మేము మరోసారి ప్రభుత్వంతో మాట్లాడుతాము. ప్రభుత్వ అభిప్రాయాన్ని నేను ఐసీసీకి తెలియజేస్తాను. ‘అని అమీనుల్ ఇస్లాం తెలిపాడు.
బంగ్లాదేశ్ ప్రపంచ కప్ పాల్గొనే విషయానికి వస్తే అద్భుతం జరుగుతుందని ఆశిస్తున్నట్లు అమీనుల్ అన్నారు. ప్లేయర్లు టోర్నమెంట్ ఆడాలని కోరుకుంటున్నారని, అయితే తుది నిర్ణయం ప్రభుత్వందేనని ఆయన చెప్పారు. ఇక ప్రభుత్వం సైతం బంగ్లాదేశ్ ప్రపంచకప్లో ఆడాలని కోరుకుంటుందన్నాడు. అయితే.. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు ఆటగాళ్ల కోరికనే కాకుండా అన్నింటిని పరిగణలోకి తీసుకుంటుంది అని చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్-సిలో ఉంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ, బంగ్లాదేశ్లతో ఉంటుంది. తొలి మూడు మ్యాచ్లను బంగ్లాదేశ్ కోల్కతాలో ఆడి, చివరి గ్రూప్ మ్యాచ్ను ముంబైలో ఆడాల్సి ఉంది.
